నిజాంసాగర్, జనవరి 25: బీఆర్ ఎస్ పార్టీ పొరుగున ఉన్న మహారాష్ట్రపై దృష్టి సారించింది. ఫిబ్రవరి 5న నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బుధవారం పరిశీలించారు. నాందేడ్లో అక్కడి మాజీ ఎంపీ డాక్టర్ వెంకటేశ్ కాబ్డేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలతో కలిసి షిండే మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మహారాష్ట్ర ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్కు ఇక్కడి వారు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తెలంగాణలాంటి పథకాలు తమ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని మహారాష్ట్ర వాసులు నిలదీస్తున్నారని చెప్పారు. ఫిబ్రవరి 5న కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలతోపాటు సరిహద్దులోని తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్కు మహారాష్ట్రవాసులు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.