హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు మొదలైందని, ఆ పార్టీల మైండ్ బ్లాంక్ అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పార్టీల నేతలు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్తో సమానమని, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యాఖ్యలపై సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా, అన్ని వర్గాలు మరింత అభ్యున్నతి సాధించేలా తమ పార్టీ మ్యానిఫెస్టో ఉన్నదని పేర్కొన్నారు. ఇటువంటి మ్యానిఫెస్టోను కలలో కూడా ఊహించలేదని, కేసీఆర్ ఇన్ని రకాల హామీలు ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు భావించలేదని వెల్లడించారు.
ఎవరిది చిత్తుకాగితమో ప్రజలే తేలుస్తరు
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను రేవంత్ చిత్తుకాగితంతో పోల్చడంపై కవిత మండిపడ్డారు. చిత్తుకాగితం కాంగ్రెస్ పార్టీదా బీఆర్ఎస్ పార్టీదా అనేది ఎన్నికల్లో ప్రజలే తేల్చుతారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ అన్ని లెకలు తీసుకొని సహేతుకంగా ప్రకటించిన మ్యానిఫెస్టోను చిత్తుకాగితమంటే.. మరి ఎటువంటి బాధ్యత, తాడూ బొంగరంలేని కాంగ్రెస్ చెప్పే మాటలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కర్ణాటకలో హామీలు అమలు చేయలేమని అకడి మంత్రులే ప్రకటిస్తున్న ఉదంతాలను చూస్తున్నామని, కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్ అని విమర్శించిరు. అంశాలవారీగా మాట్లాడకుండా అమరవీరుల స్థూపం వద్దకు రండి.. ప్రమాణం చేయండని సవాల్ చేయడం రేవంత్ స్థాయికి తగదని హితవుపలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లే అనేక మంది అమరులయ్యారని గుర్తుచేశారు. రేవంత్కు దమ్మూ, ధైర్యం ఉంటే రాహుల్గాంధీని అమరజ్యోతి వద్ద అమరవీరులకు నివాళి అర్పించాలని చెప్పాలని డిమాండ్ చేశారు. నివాళి అర్పిస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు కొన్నైనా తొలగిపోతాయని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెలంగాణ స్థితిగతులపై ఎటువంటి అవగాహన లేదని విమర్శించారు. ఏమీ తెలియని స్థానిక నేతలు రాసిచ్చే స్రిప్ట్ చదవడం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మానుకోవాలని సూచించారు.
ప్రగతిపథంలో తెలంగాణ
ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేలా మ్యానిఫెస్టో ఉన్నదని కవిత వెల్లడించారు. 2014లో రూ.1,12,000 ఉన్న తలసరి ఆదాయం నేడు రూ.3,15,000 చేరిందని, తెలంగాణ అభివృద్ధికి ఇదే నిదర్శమన్నారు. అన్ని వర్గాలను సమానంగా చూసే నేత సీఎం కేసీఆర్ కనుకనే పారిశ్రామికవేత్తలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో పాడి పరిశ్రమదారులకూ అంతే ప్రాధాన్యం ఇస్తారని వివరించారు. భూమి లేని పేదలు, పేద మహిళలను అభివృద్ధి చేసేలా మ్యానిఫెస్టో ఉన్నదని చెప్పారు. తమ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలు ఆమోదిస్తారన్న విశ్వాసం ఉన్నదని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ చేసిందేమిటీ?
అబద్ధాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని, రూ.15 లక్షలు ఒకో ఖాతాలో వేస్తామని చెప్పి విస్మరించారని, ఏటా 2 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని కవిత గుర్తుచేశారు. తెలంగాణలో 2.21 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించి యువతకు భరోసా కల్పించామని వివరించారు. గత పదేండ్లలో తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన చట్టంలో పేరొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఏమయ్యాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని స్పష్టం చేశారు.