డాలస్: అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులు, అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు బీఆర్ఎస్ అమెరికా విభాగం తరపున ప్రయత్నం చేస్తామని తెలిపారు. అమెరికా వచ్చిన విద్యార్థులు ఏదైనా కారణంతో తిరిగి వస్తే అతనితోపాటు వారి కుటుంబం ఎంతో ఆవేదనకు గురవుతుందన్నారు చెప్పారు. అందుకే విద్యార్థులకు అండగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే విద్యార్థులు కూడా అమెరికా చట్టాలను, అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకొని మసులుకోవాలని సూచించారు. స్థానిక చట్టాలతో పాటు ఇక్కడి పరిస్థితులను ప్రతీ ఒక్క విద్యార్థి అవగాహన చేసుకోవాలన్నారు. అమెరికాలోని డాలస్ పర్యటనలో ఉన్న కేటీఆర్.. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్లో చదువుకుంటున్న విద్యార్థులతో మాట్లాడారు. వర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అమెరికా పోవాలన్నా, చదువుకోవాలన్నా ఎన్నో వ్యయ ప్రయాసలకు గురయ్యే వాళ్లమన్న కేటీఆర్.. ప్రపంచం వేగంగా మారిపోయి ఇప్పుడు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దాంతోపాటే అమెరికా విద్య కూడా అనేక మందికి అందుబాటులోకి వచ్చిందన్నారు. కేవలం ర్యాంకుల కోసమో, గ్రేడ్ల కోసమో కాకుండా జీవితంలో సాధించాల్సిన ప్రధాన లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. చూస్తుండగానే మనిషి జీవితంలో 50 ఏండ్లు పూర్తవుతాయని ఇంత స్వల్ప కాలంలోనే తమ కలలు, ఆకాంక్షలను అందిపుచ్చుకోవాలన్నారు. లక్ష్యం వైపు సాగే క్రమంలో అవరోధాలు ఎదురైనా, మనతోనే ఉన్న వ్యక్తులు వెనక్కి లాగినా నిబద్ధతతో ముందుకు పోవాలని చెప్పారు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో, ప్రపంచంలో మంచి మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేయాలని విద్యార్థులకు సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆవిష్కరణలు వస్తున్నాయన్న కేటీఆర్, ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడి రాణించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. రిస్కు తీసుకున్నప్పుడు మాత్రమే కలలు సాకారం అవుతాయి అనడానికి కేసీఆర్ జీవితమే సాక్ష్యమని చెప్పారు.
రాజకీయాల్లో చిన్న వయసుగా పరిగణించే నాలుగు పదుల వయసులో పదవులను త్యాగం చేశారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం మొదలుపెట్టిన రోజు అనేకమంది ఆయనను అవహేళన చేశారని తెలిపారు. కానీ 14 సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు సమాజంలోని ప్రతి ఒక్కరు కేసీఆర్పై ప్రశంసల కురిపించారని చెప్పారు. అమెరికాలో చదువుకుని ఇండియాకి తిరిగి వచ్చి కంపెనీలు ప్రారంభించాలని విద్యార్థులను కోరారు. మనదేశంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ అనేక అవకాశాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మేథోవలస (Brain Drain) మన దేశానికి పెను సవాలుగా మారిందని చెప్పారు. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో విదేశాల్లో చదువుకుంటున్న యువత భాగం కావాలని పిలుపునిచ్చారు.