హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ప్రతీకార రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక చిహ్నమైన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా కాంగ్రెస్ సర్కార్ అవమానించిందని ఆవేదన వ్యక్తంచేస్తూ రేవంత్రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు.
మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్రెడ్డికి ఉన్న దురభిమానం, అహంకారం, ప్రతీకార రాజకీయాలతోనే రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచారని ఆరోపించారు. అంబేద్కర్ దళితుడని ఆ మహనీయుడిని అవమానిస్తారా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ను అవమానపరిచిన రేవంత్రెడ్డి అగ్రవర్ణ దురహంకారాన్ని బయటపెట్టుకున్నారని దుమ్మెత్తిపోశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారన్న కారణంతో సీఎం తన రాజ్యాంగ బాధ్యతను విస్మరించారని అనుకోవాలా? లేదంటే, రాజకీయ ప్రతీకారం ద్వేషంతో ఈ చర్యకు పాల్పడ్డారనుకోవాలా? అని నిలదీశారు.