హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా కదిలి జూబ్లీహిల్స్ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేస్తామని బీఆర్ఎస్ మహిళా నేత మాగంటి సునీత విశ్వాసం వ్యక్తంచేశారు. ఆదివారం ఆమె తెలంగాణభవన్లో పార్టీ నేతలు రావుల శ్రీధర్రెడ్డి, పీ విష్ణువర్ధన్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాయకులందరూ ఐక్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. తమ మధ్య విభేదాలు లేవని స్పష్టంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తిచేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్), సభ్యత్వ నమోదుపై చర్చించేందుకు జూలై 5న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హాజరవుతారని వెల్లడించారు.
బీఆర్ఎస్పై బీజేపీ దుష్ప్రచారం: రావుల శ్రీధర్రెడ్డి
‘సర్’కు బీఆర్ఎస్ వ్యతిరేకమని బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత రావుల శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టాలనేదే తమ అభిమతమని స్పష్టంచేశారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా బీఎల్ఏలను నియమించామని గుర్తుచేశారు. అర్హుల ఓట్లు గల్లంతుకాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉన్నదని పేర్కొన్నారు. అవకతవకలు జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యహరిస్తుండటాన్ని ఓర్వలేని బీజేపీ తమ పార్టీపై బురదజల్లుతున్నదని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నది: విష్ణువర్ధన్రెడ్డి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నదని పీ విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికలో ఓటమితో పార్టీ నేతలెవరూ కుంగిపోలేదని పేర్కొన్నారు. రెట్టించిన పట్టుదలతో ప్రజల్లోకి వెళ్తున్నామని పేర్కొన్నారు. జూలై 5న నిర్వహించే బీఆర్ఎస్ సమావేశానికి ముఖ్యనాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తిచేశారు.