హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవరాహిత్యంతో తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డులో తెలంగాణ ప్రాజెక్టులను చేర్చవద్దని బీఆర్ఎస్ నేతలు నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. మన ప్రాజెక్టులను బోర్డులో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్ శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డికి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రికి అసలు మన ప్రాజెక్టుల అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ ప్రాజెక్టులను చేర్చలేదని చెప్పారు. కేసీఆర్ హయాంలో కేంద్రానికి అనేక షరతులు పెట్టారని, అయినా కేసీఆర్ వాళ్లకు తలొగ్గలేదని చెప్పారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఒత్తిడికి లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీ జలాలపై హక్కులను ప్రభుత్వం కాల రాస్తుందని చెప్పారు. మొదట్లో కాంగ్రెస్ నేతలు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రకటించారు. ఆ మాట మీద నిలబడలేదన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి వర్గం.. ఏపీ, కర్ణాటకలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహించారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలన్నారు. ఇది ముమ్మాటికీ కేంద్రం, కర్ణాటక, ఏపీలు కలిసి చేసిన కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇటు ఏపీ, అటు కర్ణాటకలో సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను ఏ రోజు కేసీఆర్ ఫణంగా పెట్టలేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు వ్యవహారం వల్ల త్వరలో హైదరాబాద్కు తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నీళ్లకైనా కరెంటు కైనా ఢిల్లీపై ఆధారపడే పరిస్థితిని కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీపై పోరాటం చేస్తామని చెప్పారు. కేంద్రం దృష్టికి బీఆర్ఎస్ ఎంపీలు ఈ సమస్యలను తీసుకెళ్లారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన 50 రోజుల్లో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి వెంటనే అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.