Farmers | నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు, ఇతర నగదు బదిలీ పథకాలను ఆపేయాలని భారత ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడం పట్ల కర్షకలోకం కన్నెర్రజేసింది. రైతులు, దళితుల పట్ల హస్తం పార్టీ అనుచిత వైఖరి మరోసారి బహిర్గతమైందని మండిపడింది. సాగు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుసాయం అందిస్తుండగా, నోటికాడి ముద్దను కాంగ్రెస్ నేతలు ఎత్తగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఓట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడటం తగదని హితవుపలికింది.
ఈసీకి కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, దళితులు, ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్గాంధీ, మాణిక్రావు ఠాక్రే, రేవంత్, ఉత్తమ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలవ్యాప్తంగా ఎక్కడికక్కడ రేవంత్, ఉత్తమ్ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. సూర్యాపేట జిల్లా మునగాలలోని గణపవరం క్రాస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోదాడ మండలంలోని తొగర్రాయి, నడిగూడెం, నల్లగొండ జిల్లాలోని వేములపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి, చిట్యాల, రామన్నపేట మండలకేంద్రాల్లో ఠాక్రే, రేవంత్రెడ్డి, ఉత్తమ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్లలో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో, మానకొండూర్, శంకరపట్నం, గన్నేరువరం, వీణవంకతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా కొడిమ్యాల, ధర్మపురి, పెగడపల్లి మండలకేంద్రాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఆందోళనలు చేపట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి, బేల, నిర్మల్ జిల్లా పెంబి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, మంచిర్యాల జిల్లా చెన్నూర్, భీమారంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను కాల్చారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్ నియోజకవర్గవ్యాప్తంగా 11 డివిజన్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు.