హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నది. బీటెక్ కోర్సుల ఫీజులను భారీగా తగ్గించనున్నది. ఏకంగా ఇదివరకు అమలైన పాత ఫీజులకు కోతపెట్టింది. ఫీజులు తగ్గించిన కాలేజీల్లో అత్యధికం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాలేజీలే ఉన్నాయి. బీఆర్ఎస్ నేతల కాలేజీలను టార్గెట్ చేసుకుని మరీ ఫీజులు తగ్గించారు. మొత్తం 19 కాలేజీల్లో ఫీజులు తగ్గించగా 15 వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాలేజీలే ఉన్నాయి. ఇందులో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన విద్యాసంస్థలున్నాయి.
అనురాగ్ విద్యాసంస్థల కాలేజీలకు రూ. 35,100 వరకు తగ్గించారు. ఇవేకాక నల్ల మల్లారెడ్డి కాలేజీ ట్యూషన్ ఫీజును ఏకంగా రూ. 45వేలు తగ్గించారు. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫీజును రూ. 43వేలకు కోతపెట్టారు. ఈ విషయం చివరికి హైకోర్టుకు చేరింది. విద్యాసంవత్సరం ముగింపునకు చేరుకున్నా ప్రభుత్వం ఫీజులను ఖరారుచేయకపోవడంతో కొన్ని యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఇదే విషయం కోర్టు విచారణలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 157 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 2025 -28 విద్యాసంవత్సరానికి ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) ఓ నివేదికను సిద్ధం చేసి సర్కార్కు సమర్పించింది. ఓ ఐదు కాలేజీల ఫీజుల సవరణకు ప్రతిపాదనలు సమర్పించలేదు. అంటే ఇవి మూతపడ్డట్టే లెక్క. కాగా 63 కాలేజీల్లో ఫీజులను పెంచారు. మరో 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించారు.
కాంగ్రెస్ నేతల కాలేజీల్లో పెంపు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలకు చెందిన కాలేజీల్లో భారీగా ఫీజులు పెంచబోతున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన బ్రిలియంట్ కాలేజీలో ఫీజును రూ. 9,200కు పెంచారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కాలేజీలో, జనగామ నుంచి పోటీచేసిన కొమ్మూరి ప్రతాప్రెడ్డి కాలేజీలో రూపాయి కూడా తగ్గించలేదు. ఈ కాలేజీల్లో పాత ఫీజులనే సిఫారసు చేశారు. తీగల కృష్ణారెడ్డి కాలేజీలో రూ. 14,500 పెంచేందుకు ప్రతిపాదించారు. ఇక కొన్ని కాలేజీల్లో అయితే భారీగా ఫీజులు పెంచారు. 10 కాలేజీల్లో గరిష్ఠంగా రూ. 62వేలు, కనిష్ఠంగా రూ.21,200 పెంచారు. జీ నారాయణమ్మ కాలేజీ ఫీజును ఒకేసారి రూ.62వేలు పెంచాలని నిర్ణయించారు. వాసవీ కాలేజీ ఫీజును రూ.35వేలు, గోకరాజు రంగరాజు కాలేజీలో రూ. 30,500, శ్రీదేవి మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో రూ. 27వేలు, కేశవ్ మెమోరియల్ కాలేజీలో రూ.26,200, వీఎన్నార్ విజ్ఞానజ్యోతిలో రూ, 24,600 పెంచేందుకు టీఏఎఫ్ఆర్సీ సిఫారసు చేసింది.
ఫీజులు తగ్గిన కాలేజీలు
కాలేజీ : తగ్గించిన ఫీజులు
నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ : 45,000
గురునానక్ : 43,000
అనురాగ్ గ్రూప్ : 35,100
సీఎమ్మార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ : 31,900
సీఎమ్మార్ టెక్నికల్ క్యాంపస్ : 25,300
మహావీర్ : 25,000
సీఎమ్మార్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ : 23, 800
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఫర్ విమెన్ : 22,700
అర్జున్ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ : 22,000
విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ : 19,800
ఎంఎల్ఆర్ఐటీ : 19,800
ఏఏఆర్ మహావీర్ కాలేజీ : 15,000
మర్రి లక్ష్మణరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ : 11,500
మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ : 10,200
సెయింట్ మార్టిన్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ : 9,200
సీఎమ్మార్ ఇంజినీరింగ్ కాలేజీ : 5,000