MP Arvind | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ బీజేపీలో జరిగిన అంతర్గత పోరును ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మెడకు చుట్టేశారు. జిల్లా పార్టీలో సంస్థాగత నిర్ణయాలు, మార్పులు, చేర్పుల బాధ్యత అధ్యక్షుడిదేనని గొడవ జరిగిన రోజే స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని వల్లె వేశారు. దీంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన అసంతృప్త నేతలు మండిపడుతున్నారు. లక్ష్మీనారాయణ నామమాత్రంగా పదవిలో కొనసాగుతున్నారని, పెత్తనం ధర్మపురి అర్వింద్దేనని చెప్తున్నారు. అర్వింద్ చెప్పినట్టు నడుచుకోకుంటే లక్ష్మీనర్సయ్య పదవి పోతుందని పేర్కొంటున్నారు. మండలాధ్యక్షుల మార్పుల జాబితాను కూడా అర్వింద్ సిద్ధం చేశారని, లక్ష్మీనారాయణ కేవలం సంతకం పెట్టారని చెప్తున్నారు.
రాష్ట్రంలో ప్రజలు వర్షాలు, వరదలతో అల్లాడుతుంటే బీజేపీ నేతలు రాజకీయాలకే పరిమితమయ్యారు. ధర్మపురి అర్వింద్ ఢిల్లీలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వరదలతో బాధపడుతుంటే ప్రగతిభవన్కు పరిమితం అయ్యారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారని, మంత్రి కేటీఆర్ సహా ఇతర మంత్రులంతా ఎవరి జిల్లాల్లో వారు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని గుర్తు చేస్తున్నారు. బీజేపీ నేతలు కేవలం రాజకీయాలకే పరిమితం అయ్యారని, పీఎం సమృద్ధి కేంద్రాల పేరుతో ప్రారంభోత్సవాలు, సంబురాలు చేసుకున్నారని విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే తనకేమీ పట్టనట్టుగా రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ నేతలు ఎంతమంది క్షేత్రస్థాయిలో పర్యటించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.