Y Satish Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపింది అని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ పేరుతో చేసిన హడావుడి మొత్తం ఇప్పుడు మరో మలుపు తిరిగిందన్నారు.
హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై.. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్య వయసు ఉన్న పురుషులను ఆనందపెట్టాలని తమపై ఒత్తిడి తీసుకువచ్చారని తమను వేశ్య లాగా చూశారంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోటీల నుంచి మధ్యలోనే తప్పుకుని స్వదేశానికి వెళ్ళిపోయారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఘటనలు జరగడం.. అది కూడా మన రాష్ట్రంలో జరిగినప్పుడే తెరపైకి రావడం ప్రభుత్వ తీరుపై, నిర్వాహకుల తీరుపై అనేక అనుమానాలను కలిగిస్తోంది అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
చాలా గ్రాండ్గా ఈ వేడుకలు నిర్వహిస్తాం.. పోటీదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తాం.. ఈ పోటీలతో పెట్టుబడులు వస్తాయి..యువతకు ఉద్యోగాలు వస్తాయి అంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు… మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి. ఇది కేవలం నిర్వాహకులపై చేసిన ఆరోపణ కాదు. మన రాష్ట్ర రాజధానిలో ఈ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇది మన రాష్ట్ర ప్రతిష్టకు, మన దేశ పరువు, ప్రతిష్టలకు సంబంధించిన విషయం. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలి అని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రపంచ దేశాల నుంచి వచ్చిన యువతులను వేధించింది ఎవరు..? ఆ వేధింపులకు కారణమైంది ఎవరు? ఆనంద పెట్టాలని నిర్వాహకులు ఎవరి కోసం వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు..? ఆ వ్యక్తులు ఎవరు..? ఈ అంశాలన్నీ బయటకు రావాలి. దీనిపై వెంటనే రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి విచారణ చేపట్టాలి. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకొని రాష్ట్ర, దేశ పరువు ప్రతిష్టలను కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాల నుంచి పోటీల కోసం వచ్చిన యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన వారు వారితో అసభ్యకరమైన పనులు చేయించాలని ప్రయత్నించిన వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకొని తెలంగాణ గడ్డపై మహిళలను అవమానించిన వారిని జైలుకు పంపించాలి అని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.