హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : బ్యూటిఫికేషన్ పేరుతో మూసీని లూటిఫికేషన్ చేయాలన్నదే కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశమని బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి ఆరోపించారు. ఏఐ బొమ్మలు చూపుతూ సీఎం రేవంత్రెడ్డి ఎర వేస్తున్నారని, మూసీని బాగుచేసే ఉద్దేశం ఆయనకు ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఆర్కిటెక్చర్తో డిజైన్లు సిద్ధం చేయించకుండానే ఏఐ ఫొటోలతో తెగ హంగామా చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
రూ.లక్షన్నర కోట్లతో మూసీని బ్యూటిఫికేషన్ చేస్తాం, గాంధీ విగ్రహం పెడుతామని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు, వ్యాపార, రాజకీయ నాయకులకు ఇచ్చిన ఆహ్వాన పత్రికలపై రెండు వేర్వేరు బొమ్మలు ఉన్నాయని ఆరోపించారు. తాము పెట్టబోయే గాంధీ విగ్రహం ఇదేనంటూ గతంలో సర్కార్ మొదటి ఫొటో విడుదల చేసిందని, ఇప్పుడు దానిని మార్చి మరో ఫొటో విడుదల చేసిందని మండిపడ్డా రు. పూటకో విధంగా ఏఐతో ఫొటోలు మారుస్తున్నారని ధ్వజమెత్తారు.