హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుదారులపై పార్టీ మారిన 24 గంటల్లోనే స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్కుమార్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారిపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పార్టీ మారే వాళ్లను ఉరితీసే చట్టం చేయాలని, ఆ విధంగా రాజ్యాంగంలో చేర్చాలని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు ఫిరాయింపుదారులకు కండువాలు ఎలా కప్పుతున్నారని ప్రశ్నించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నదని, అనర్హత వేటు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపుదారుల అనర్హతల అంశంపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, పార్టీ మారిన రోజునుంచే వారిని అనర్హులుగా భావించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని గుర్తుచేశారు. పార్టీ ఫిరాయింపుదారులపై ‘త్వరగా నిర్ణయం తీసుకోవాలని’ రాజ్యాంగంలో ఉన్నదని వివరించారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోమని చెప్పినా, వారికి వారే మాట్లాడుకొని ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతిపక్ష పాత్ర ఒక వరం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర చాలా గొప్పదని, అదొక వరంగా భావించి ప్రజలకు సేవల చేయాలని బీ వినోద్కుమార్ కోరారు. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన ఎంపీలు ఏ ప్రయోజనం ఆశించి వెళ్లారని ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం తప్పని స్పష్టంచేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1985లో రూపొందించారని, ఆయన మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా కాంగ్రెస్ నేతలు ఫిరాయింపులను ప్రోత్సహించకూడదని హితవు చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలిచినోడు మరో పార్టీలో చేరకుండా అనర్హత వేటు వేయాలని చెప్పిన రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉద్యమకారులేనని పేర్కొన్నారు. కరీనంగర్లోని ప్రతిమ మల్టీఫ్లెక్స్లో దొరికిన డబ్బుకు నిర్వాహకులే లెకలు చెప్పుకుంటారని, వారు తనకు బంధువులైనంత మాత్రాన తన మీద నిరాధార ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్ పాల్గొన్నారు.