సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే మాజీమంత్రి హరీశ్రావు సవాల్ను స్వీకరించాలని గజ్వేల్ బీఆర్ఎస్ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. హరీశ్రావు సవాలు స్వీకరించి మల్లన్న సాగర్, కొండపోచమ్మ ముంపు గ్రామాల్లో పర్యటిస్తే వెయ్యి మందితో స్వాగతం పలుకుతామని తెలిపారు. శుక్రవారం గజ్వేల్లో వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముంపు గ్రామాలకు చెందిన 9,600మంది బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు, ప్యాకేజీలు అందజేశామని తెలిపారు. ప్రస్తుతం ముంపు గ్రామాలకు చెందిన 400మంది నిర్వాసితులకు రావాల్సిన రూ.448కోట్లను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మైకుల ముందు మాట్లాడి ప్రజలను అయోమయానికి గురిచేసి అబద్ధాలు చెప్పడం కాంగ్రెసోళ్లకు అలవాటైందని వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి తాగు, సాగునీటిని అందించిందని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పుల ఉబిలోకి నెట్టుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ముందుకు సాగారని పేర్కొన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణంతో హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. మూసీ సుందరీకరణతో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు ఎలా పెడుతారో ప్రజలకు రేవంత్రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మూసీకి పెట్టే ఖర్చుతో ఎన్ని ప్రాజెక్టులను నిర్మిస్తారో, ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతుందో చెప్పాలన్నారు. ఢిల్లీ బాసులకు డబ్బులను పంపేందుకే మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల మీద రేవంత్రెడ్డికి సోయిలేదని, మూసీ పెద్ద స్కాం అని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, చేతకాని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.