స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలని కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య స్పందించారు. కడియం సవాలును స్వీకరిస్తున్నానని చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. కడియం శ్రీహరి స్థానికేతరుడు అని.. ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలని కడియం శ్రీహరి అంటున్నాడని.. ఆయన ఎక్కడ కూడా తనకు పోటీ రాలేడని రాజయ్య అన్నారు. తాను వరుసగా నాలుగుసార్లు గెలిచానని గుర్తుచేశారు. కడియం శ్రీహరి ప్రజా నాయకుడు కాదని.. రాజకీయ నాయకుడు మాత్రమేనని విమర్శించారు. కడియం స్థానికేతరుడు అని.. ఆయన్ను తప్పకుండా తరిమికొడతానని అన్నారు.
కడియం శ్రీహరి విసిరిన సవాలును స్వీకరిస్తున్నా అని తాటికొండ రాజయ్య అన్నారు. ‘ నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. ఇక్కడే ఉంటా.. రేపు ఛస్తే ఇక్కడే నన్ను బొంద పెడతారు. ‘ అని చెప్పారు. కానీ నిన్ను స్థానికేతరుడిలాగే గుర్తిస్తారని కడియం శ్రీహరిని ఉద్దేశించి రాజయ్య పేర్కొన్నారు. ఆయన్ను పర్వతగిరికి పంపించే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు.
సత్యహరిశ్చంద్రుడిలా నీతిమంతుడినని కడియం శ్రీహరి డబ్బా కొట్టుకోవడం సిగ్గు చేటు అని రాజయ్య విమర్శించారు. ఆయన అనేక అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి తిమింగలంలా అయ్యాడని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కడియం శ్రీహరి రూ.100 కోట్లు ఖర్చు చేశారని తెలిపిన ఆయన.. ఆ 100 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు.