ఖమ్మం, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడబోరని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. కేసీఆర్పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. డబ్బు మదంతో పొంగులేటి ఖమ్మం రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ను దేవుడిగా కీర్తించిన పొంగులేటి.. నేడు అదే కేసీఆర్ను దెయ్యమని విమర్శిస్తుండటం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు.
జిల్లాలో ముసుగేసుకొని తిరుగుతున్న చెడ్డీ గ్యాంగుల వల్ల బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న వారికి ప్రజలే బుద్ధిచెప్తారని హెచ్చరించారు. బీజేపీ నాయకులతోనే తెలంగాణ సాధించారని వ్యాఖ్యానించిన శ్రీనివాసరెడ్డికి ఏ మా త్రమైనా జ్ఞానముందా? అని ప్రశ్నించారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి వ్యాఖ్యలైనా చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణను సాధించిన మహోన్నతుడిపై నిందలు వేసే స్థాయి ఆయనకు లేదని స్పష్టం చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను ఢీకొనాలనుకోవడం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పగటికలగానే మిగులుతుందని అన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్పై నోరు జారితే ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు.