హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ‘అధికార కాంగ్రెస్ రౌడీయిజం ఎక్కువ కాలం నడువదు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వారి తరహాలో వ్యవహరించి ఉంటే ఆ పార్టీ ఉండేది కాదు’ అని బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం రావణకాష్టంలా మారిందని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు కిశోర్గౌడ్, లక్ష్మణ్, రవినాయక్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే రోజు కేసీఆర్ పుట్టిన రోజు అని అభివర్ణించా రు. గాంధేయమార్గంలో తెలంగాణ సాధించిన మహానేత కేసీఆర్ అని కీర్తించారు. పోరాడి సాధించిన తెలంగాణను పదేండ్లలో దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని ఉద్ఘాటించా రు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొంటాం..
గాంధేయమార్గంలో తెలంగాణ సాధించిన కేసీఆర్ తమకు అదే విధానం నేర్పారని సాయికిరణ్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ తమ నాయకులపై పెట్టే అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. ఉద్యమాలు తమకు కొత్తకాదని, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకలకు కేటీఆర్, హరీశ్రావు హాజరవుతారని వెల్లడించారు. గులాబీ సైనికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.