హనుమకొండ, మార్చి 6 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ పేరిట రాష్ట్రంలో అటెన్షన్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రగతే లేనప్పుడు, ప్రగతి ప్రణాళిక ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను మోసం చేసి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని శిల్పకళావేదికలో రేవంత్రెడ్డి ఎస్సీ ఉద్యోగులతో సన్మానం చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. దళితులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం హామీలు ఏమైందో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో గుట్టలు నాశనం చేసి కంకర సప్లయ్ చేస్తూ, రాష్ట్ర వనరులను దోచుకుంటూ మానుకోటకు వచ్చి ప్రగతి గురించి మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.