Rega Kantha Rao | హైదరాబాద్ నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు దర్శనమిచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతకు, చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుందని మాజీ విప్ రేగా కాంతారావు మండిపడ్డారు. కాంగ్రెస్ నెలరోజుల పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశం అనంతరం రేగా కాంతారావు మాట్లాడుతూ.. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉన్నదని అన్నారు. రుణమాఫీ అయినోళ్లంతా బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షలు తెచ్చుకోవాలని, డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, మరి ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇలా ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. తాము అడిగితే.. నెలరోజులకే తొందరెందుకు అంటున్నారని, కానీ.. కాంగ్రెస్ హామీలను మాత్రమే తాము గుర్తు చేస్తున్నామని చెప్పారు.