హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలితే బీజేపీ ఎంపీ బండి సంజయ్కి బడితపూజ తప్పదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. పార్టీ అధ్యక్ష పదవి పోయిన ఫ్రస్టేషన్లో బండి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దురహంకారంతో నీచంగా మాట్లాడుతున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ నోరు జారితే, తాము చేతికి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్తారంటూ పత్రికల్లో ఊహాగానాలు వస్తేనే తప్పుబడుతున్న బండి సంజయ్.. ఎంపీగా తను, కిషన్రెడ్డి ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బండి బూతులు మాట్లాడుతూ తన స్థాయిని రోజురోజుకు దిగజార్చుకుంటున్నారని మండిపడ్డారు. పొత్తుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి, ఆ వ్యాఖ్యలు చేశారో, బీజేపీతో పొత్తు కావాలని బండిని ఎవరు అడిగారో చెప్పాలని సవాల్ చేశారు. తెలంగాణకు విభజన హామీలు, నిధులు ఇవ్వడంలో వివక్ష చూపిన బీజేపీ ఎన్నటికీ శత్రువేనని స్పష్టంచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ సహా ఇతర బీజేపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ఓడించిందని గుర్తుచేశారు. ఓటమి భయంతోనే కిషన్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బండికి ప్రజలు తగిన బుద్ధిచెప్తారని పేర్కొన్నారు. బీజేపీలో జాతీయ స్థాయి పదవి ఉన్నా.. బండి పరిస్థితి గల్లీ లీడర్ కంటే అధ్వానంగా మారిందని మం డిపడ్డారు. ఉనికి చాటుకునేందుకు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.