Ravula Sridhar Reddy | కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్లో గెలిచే పరిస్థితి లేదని గ్రహించే కిషన్ రెడ్డి ప్రజలకు నివేదిక పేరిట ఓ పత్రాన్ని విడుదల చేశారన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడారు.
గత పదేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని కిషన్ రెడ్డి అంటున్నారని రావుల అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి రూ.46 వేల కోట్లను తీసుకొచ్చానని కిషన్ రెడ్డి బీరాలు పలుకుతున్నారని విమర్శించారు. ఒకవేళ నిజంగా ఆ నిధులు తీసుకొస్తే.. ఎక్కడైనా సరే పనుల రూపంలో కనిపించాలి కదా అని ప్రశ్నించారు. అన్ని నిధులు తీసుకొస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా బీజేపీ ఎందుకు గెలవలేదని అడిగారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఉంటే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ముగ్గురు బీజేపీ ఎంపీలు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.
రైల్వేస్టేషన్లో లిఫ్టులు, పంపులు ప్రారంభించడం, కరోనా సమయంలో కుర్కురే ప్యాకెట్లు పంచడం తప్ప కిషన్ రెడ్డి సాధించిందేంటని రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కిషన్ రెడ్డి నివేదికలంటూ ప్రజలను భ్రమల్లో పెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలకు బీజేపీ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రమంత్రిగా తెలంగాణ అభివృద్ధి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. విభజన చట్టంలోనీ హామీలను కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు. రాజ్యాంగ పరంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా కిషన్ రెడ్డి బీజేపీ అకౌంట్లో వేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి తనకు తాను క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని అని చెప్పుకుంటే ఎలా అని రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు కూడా క్లీన్ ఇమేజ్ ఉందని ఆయన స్పష్టం చేశారు. తనకు కేసీఆర్ గౌరవం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారని.. తెలంగాణకు గౌరవం ఇవ్వని కిషన్ రెడ్డికి కేసీఆర్ గౌరవం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఇన్ని రోజులు ప్రజల్లో లేని కిషన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని బయల్దేరాడని అన్నారు. కిషన్ రెడ్డి ఎన్ని రిపోర్టులు ఇచ్చినా ఆయన అసలైన రిపోర్టు ప్రజల దగ్గర ఉందన్నారు. వాళ్లే ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి సరైన గుణపాఠం చెబుతారని అన్నారు.