పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 11 : నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని జొన్నలబొగుడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రాత్లావత్ మంగమ్మపై ఆమె దాయాదులు కాంగ్రెస్ వర్గీయుల సహకారంతో గురువారం దాడిచేశారు. మంగమ్మ సాతాపూర్ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 135లో ఇంటిని నిర్మించుకున్నది. ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ, తహసీల్దార్ కార్యాలయం నుంచి నాలా అనుమతి ఉన్నది.
కాగా, అధికార పార్టీ నాయకుల అండదండలతో దాయాదులు తన ఇంటిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మంగమ్మ తెలిపారు. గురువారం మంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై సతీశ్ పేర్కొన్నారు. కాగా, మంగమ్మ భర్త రాజునాయక్పై బుధవారం కాంగ్రెస్ వర్గీయులు దాడులు చేయడంతో గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని మంగమ్మ కోరుతున్నారు.