హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): నటనలో సీఎం రేవంత్రెడ్డికి ఆస్కార్ అవార్డు రావొచ్చని, అంతటి నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేదు కాని.. పార్లమెంట్ ఎన్నికల కోసం రకరకాల పేర్లతో కొత్త మ్యానిఫెస్టోలను విడుదల చేస్తున్నదని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల కోసం పాంచ్న్యాయ్, 25 హామీలతో మరో మ్యానిఫెస్టోను విడుదల చేశారని విమర్శించారు. ఎన్నికలు ఏడు రోజులు ఉండగా ఓట్ల కోసం కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసిందని ఎద్దేవా చేశారు.
శనివారం తెలంగాణభవన్లో మీడియా సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలోకి వస్తామనే ధీమా లేదని, అందుకే తాము అధికారంలోకి వస్తే అని అంటున్నారని ఎద్దేవాచేశారు. ఆరు గ్యారెంటీలు, 13 పథకాల ఎక్కడ అమలయ్యాయో చెప్పాలని రేవంత్రెడ్డికి పొన్నాల సవాల్ విసిరారు. డిసెంబర్ 9నే అమలుచేస్తామన్న రుణమాఫీ ఏమైందని నిలదీశారు. రేవంత్రెడ్డి అబద్ధాలు, నాటకాలు అడుతున్నారని ధ్వజమెత్తారు. మల్కాజిగిరి ఎంపీగా ఆ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి రేవంత్రెడ్డి అక్కడ ఓట్లు అడగాలని హితవు పలికారు. గాడిద గుడ్డు అంటున్న రేవంత్రెడ్డి, తన హామీలు కూడా గాడిద గుడ్డు అనే విషయాన్ని మరిచారని విమర్శించారు.
రామమందిరం పేరుతో సమాజాన్ని చీల్చే కుట్ర బీజేపీ చేస్తున్నదని పొన్నాల ఆరోపించారు. ఓట్ల కోసం రామమందిరాన్ని బీజేపీ పావుగా వాడుకుంటున్నదని విమర్శించారు. రామమందిరానికి బీజేపీకి సంబంధం ఏమిటని నిలదీశారు. రామమందిరం తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందని, రామమందిరాన్ని కట్టింది ట్రస్ట్ అని, మధ్యలో బీజేపీ ప్రచారం చేసుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. బీజేపీ సర్కారు నల్ల చట్టాలు తెచ్చి కొన్ని వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్నదని విమర్శించారు. కేంద్రంలోని మోదీ సర్కారు పదేండ్లలో రూ.4.50 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ ఆస్తులను విక్రయించిందని ఆరోపించారు. దీనిపై చర్చించడానికి బీజేపీ నేతలు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. బీజేపీ చెప్తున్నట్టు పదేండ్లలో మూడు కోట్ల ఇండ్లు కట్టలేదని, కట్టిన 1.40 కోట్ల ఇండ్లు కూడా బీజేపీ పాలిత ఏడు రాష్ర్టాల్లోనూ కట్టారని, చేసిందని కొంత అయితే, చెప్పేది కొండంత అని ఎద్దేవా చేశారు.