Peddi Sudarshan Reddy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను మృతి పట్ల బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గాడితప్పిన పాలనకు నిదర్శనమే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి అని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలన్నారు. ఎస్సై కుటుంబానికి తక్షణమే కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాలను, రైతులను, నిరుద్యోగులను చివరకు ఉద్యోగులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
♦️ ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి
♦️ దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి
♦️ రాష్ట్రంలో గాడిదప్పిన పాలనకు నిదర్శనమే ఎస్సై శ్రీనివాస్ మృతి.. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క… pic.twitter.com/F38hXnQtm3
— BRS Party (@BRSparty) July 7, 2024
అశ్వారావుపేట పోలీస్ సేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఎస్సై శ్రీను జూన్ 30న ఉదయం 8.30 గంటలకు మఫ్టీలో స్టేషన్కు వచ్చారు. సోమవారం నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. అదే సమయంలో ప్రైవేట్ కారు రావడంతో డ్రైవర్ను దింపిన ఎస్సై.. ఇప్పుడే వస్తానంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు.
మధ్యాహ్నం తరువాత సిబ్బంది ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో సీఐ జితేందర్రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఎస్సై ఫోన్ లోకేషన్ను ట్రాక్ చేయగా మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత మండలంలోని తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారు. కానీ రాత్రి 10:45 గంటల వరకు ఆచూకీ లభ్యం లభించలేదు. ఇంతలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. తోటి సిబ్బంది వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం చేశానని శ్రీనివాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ జితేందర్రెడ్డి, పోలీసు కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేశారు.