KTR | కేసీఆర్ను తక్కువ చేయాలని.. కురచ బుద్ధితో విమర్శలు చేసినంత మాత్రాన నిజాలు దాగవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) రంగం అభివృద్ధిలో పరుగులు పెట్టిందని గుర్తు చేశారు. తాను చెబుతున్నది కాదని.. స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా లెక్కలతో సహా వివరించిందన్నారు. కేసీఆర్పై బురద చల్లాలని.. తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ లెక్కలు మాత్రం అబద్దాలు చెప్పారని కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) పాలసీలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించిన అంశాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టిందనడానికి కాంగ్రెస్ చెప్పిన లెక్కలే నిదర్శనమన్నారు. గత పదేళ్లలో (MSME) వృద్ధి రేటు 11 శాతం నుంచి 15 శాతం ఉందని ప్రభుత్వమే ఒప్పుకుందని కేటీఆర్ చెప్పారు. 2018-2023 మధ్యలో టీఎస్ఐపాస్ ద్వారా పెరిగిన సగటు పెట్టుబడులు 115శాతం ఉన్నాయన్నారు. జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటాలో 10శాతం వృద్ధి చెందిందన్నారు. ఏటా ఎంఎస్ఎంఈల సంఖ్య 15 శాతం పెరిగిందని, ఎంఎస్ఎంఈల కారణంగా ఉపాధి 20శాతం పెరిగిందన్నారు.
ఎంఎస్ఎంఈల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలు 30శాతం ఉద్యోగాలు పొందారని.. 2020-2023 మధ్యలో అతి తక్కువ ఎంఎస్ఎంఈలు మూసివేయబడ్డ రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇవి బీఆర్ఎస్ చెబుతున్న లెక్కలు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్కనేనని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్ వంటి ప్రగతిశీల విధానాలు, చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ఈ అద్భుత ప్రగతి సాధ్యమైందన్నారు. కేసీఆర్ని తక్కువ చేయాలనుకొని కురచ బుద్ధితో విమర్శలు చేసినంతా మాత్రాన నిజాలు దాగవని అన్నారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో.. కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడన్నది అంతే నిజమని కేటీఆర్ అన్నారు. ఇదే విషయాన్ని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమో ఒప్పుకోకతప్పదని స్పష్టం చేశారు.