హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): వారెంట్ ఉంటేనే ఫోన్ సీజ్ చేయాల్సి ఉంటుందని, కానీ ఎలాంటి వారెంట్ లేకుండానే తన ఫోన్ ఎందుకు సీజ్ చేశారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ నిలదీశారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడబోనని స్పష్టం చేశారు. చిత్రపురి సొసైటీ అవినీతిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.
గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు దినేశ్కుమార్, జగన్మోహన్రావు, సతీశ్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ వరింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ ఫిర్యాదుతో తనపై మాదాపూర్ పోలీసులు కేసు పెట్టారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బుధవారం రాత్రి ఏడు గంటలకు పోలీసులకు తనకు చెప్పారని, లాయర్తో కలిసి ఠాణాకు వెళ్తే కేసు వివరాలు అందించారని తెలిపారు. కానీ, వారెంట్ లేకుండానే తన ఫోన్ను కూడా సీజ్ చేశారని, ఫోన్ పాస్పోర్ట్ కూడా తీసుకున్నారని వాపోయారు.
వారు చెప్పిందే పోస్టు చేశా
చిత్రపురి కాలనీలో రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ఖాన్ ఆరోపణలు చేశారని, ప్రముఖ యూట్యూబర్ కూడా అవినీతి జరిగిందని చెప్పారని, తాను అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశానని క్రిశాంక్ చెప్పారు. చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల మహానందరెడ్డి ఎవరో తెలియదని సీఎం అంటున్నారని, మహానందరెడ్డితో సీఎం దిగిన ఫొటోలను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు.
తన ఫోన్లో అనేక రకాల సమాచారం ఉన్నదని, ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలకు సంబంధించి పరిశోధన సమాచారం అందులో ఉన్నదని తెలిపారు. తనపై పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తానని, చట్ట ప్రకారం ఫోన్లను జప్తు చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. జ్యుడీషియల్ వారెంట్ ఉంటేనే ఫోన్లు జప్తు చేయాలని, కానీ తనకు ఎలాంటి వారెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు.
నాడు రేవంత్రెడ్డి ఫోన్ తీసుకోలేదు..
చిత్రపురిలో జరిగిన రూ.3 వేల కోట్ల కుంభకోణంపై రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని క్రిశాంక్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయలేదా? గతంలో ఏనాడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్రెడ్డి ఫోన్ను తీసుకోలేదని పేర్కొన్నారు. తాము కూడా అలా చేస్తే రేవంత్రెడ్డి రాజకీయాలు చేసేవారా? అంటూ నిలదీశారు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని గుర్తుకు తెస్తుందని మండిపడ్డారు.
గ్రామస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని, తమ ఫోన్లతోపాటు పీఏ, పీఆర్వోల ఫోన్లను సైతం తీసుకుంటున్నారని విమర్శించారు. తన ఫోన్ను మాదాపూర్ పోలీసులు కోర్టుకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. తన ఫోన్ పోలీసుల దగ్గర ఉన్నదా? లేక రేవంత్రెడ్డి దగ్గర ఉన్నదా? అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. డాటా గోప్యతపై కోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చిందని, వాటి ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయ స్థానంలోనే తేల్చుకుంటామని చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలోనూ ఇదే తరహాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడిపై దాడుల చేశారని గుర్తుచేశారు. పోలీసులు కూడా నియమ, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలని హితవుపలికారు.
ప్రజల తరఫున పోరాడుతాం
సోషల్ మీడియాలో అధికార పక్షం గురించి ఒక్క పోస్టు పెట్టినా కేసులు పెడుతున్నారని సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి ఆరోపించారు. కేసుల కంటే ముందు 100 రోజుల్లో 13 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు ఎందుకు అమలు చేస్తలేరని ప్రశ్నిస్తే, ప్రజ ల తరఫున పోరాడితే ఫోన్ సీజ్ చేస్తారా? కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమని, పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్ట్టులపై కూడా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదేనా స్వేచ్ఛా అంటూ ప్రశ్నించారు. ప్రజల తరఫున పోరాడుతామని స్పష్టంచేశారు.