Murders | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): పాలమూరు జిల్లాలో కేవలం ఐదు నెలల్లో జరిగిన రెండు రాజకీయ హత్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ హత్యలే కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మహబూబ్నగర్ జిల్లాలో హత్యకు గురైన ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. ఈ హత్యలకు కాంగ్రెస్ నేతలే కారణమంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తమ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడటం, హత్య చేయడంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది.
రాష్ట్రంలో రౌడీ రాజకీయాన్ని నడపాలన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు జరుగుతున్న పరిణామాలే తేల్చిచెప్పుతున్నాయని మండిపడింది. బీఆర్ఎస్ క్యాడర్ను భయభ్రాంతులకు గురిచేసి తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నట్టు అర్థమవుతున్నదని ఆరోపించింది. బీఆర్ఎస్ లక్ష్యంగా పనిచేయాలని, ఈ పార్టీని బలహీనపర్చి పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతున్నదని తెలిపింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్లో బీఆర్ఎస్లో చురుకైన కార్యకర్త మల్లేశ్ యాదవ్ను భూ తగాదాల ముసుగులో హతమార్చారని వెల్లడించింది. తన భర్త మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మల్లేశ్ యాదవ్ భార్య పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని బీఆర్ఎస్ తెలిపింది. అంతేగాక తాజాగా గురువారం అదే జిల్లాలో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకోవటం ద్వారా సర్కారు ఏ సంకేతాలు ఇస్తున్నదని ప్రశ్నించింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే ఊరుకునేదిలేదని బీఆర్ఎస్ హెచ్చరించింది.