హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ వీరిద్దరికీ కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతించారు.
బీఆర్ఎస్ తమ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్యను ప్రకటించినప్పటికీ ఆమె బరిలో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో వరంగల్ అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి కడియం శ్రీహరిని బరిలోకి దింపుతుందా? లేక కావ్యకు అవకాశం ఇస్తుందా అనేది తేలనున్నది.