హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని, ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం తనను జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్న సమయంలో రౌస్ అవెన్యూ కోర్టు ఆవరణలో ఉన్న మీడియా ప్రతినిధులతో కవిత మాట్లాడారు. ఇప్పుడు తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చని, కానీ, తన ఆత్మస్థయిర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి బీజేపీలో చేరాడని, మరో వ్యక్తి బీజేపీ కూటమి నుంచి పోటీచేస్తున్నాడని, ఇంకో వ్యక్తి బీజేపీకి రూ.50 కోట్ల విలువైన ఎలక్ట్రోల్ బాండ్లు కొన్నాడని చెప్పారు. ఇది కట్టుకథలతో పెట్టిన తప్పుడు కేసు.. ఇది అక్రమ కేసు అని, దీనిపై పోరాటం చేస్తానని స్పష్టంచేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈ నెల 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అరెస్టు చేయగా, కోర్టు ఆమెకు విధించిన పది రోజుల ఈడీ కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో ఉదయం ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తమ విచారణ ఇంకా పూర్తికాలేదని, కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నదని, ఇంకా కొంతమంది నిందితులను ప్రశ్నించాల్సి ఉన్నదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కవితను 15 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని కోరారు. ఈడీ వాదనలు విన్న న్యాయస్థానం కవితను 14 రోజులపాటు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. ఆమెకు జైలులో కొన్ని వెసులుబాట్లు కల్పించాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. పుస్తకాలు, పెన్ను, పేపర్లు, మందులు, ఆభరణాలు తీసుకోవడానికి, ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి, పడుకోవడానికి మంచం, దుప్పట్లు, చెప్పులు వంటివి సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. ఇదిలా ఉండగా, కవిత అభ్యర్థన మేరకు తన కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఆమె కోర్టు హాలు వద్ద భర్త అనిల్, ఇతర కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 1న విచారణకు రానున్నది. తనకు 16 ఏండ్ల కొడుకు ఉన్నాడని, అతని పరీక్షల షెడ్యూల్ విడుదలైందని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని కోరారు. తాము రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశామని ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని కవిత తరఫు న్యాయవాది విక్రంచౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, బెయిల్ దరఖాస్తుపై సమాధానం ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని ఈడీ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ నెల 1న విచారణ జరుపుతామని, ఆ లోపు ఈడీ సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదుచేసిన స్టేట్మెంట్లన్నింటినీ భద్రపరచాలని, తమకు కూడా ఒక కాపీ ఇవ్వాలని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రంచౌదరి కోరారు. ఇందుకోసం ఒక దరఖాస్తు అందజేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సూచించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ అడ్జెడూకేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందని న్యాయమూర్తి దృష్టికి ఈడీ తరఫు న్యాయవాది తీసుకెళ్లారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు చేసిన అన్నిరకాల వైద్యపరీక్షలకు సంబంధించిన రికార్డులను కూడా కవిత తరఫు న్యాయవాదులకు అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తప్పుడు కేసు బనాయించారని, ఆమె నిర్దోషిగా బయటకు వస్తారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్తో కలిసి మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆమెపై కేసుపెట్టి జైలుకు పంపారని విమర్శించారు. కవిత అరెస్ట్తోపాటు పార్టీలో నెలకొన్న పరిస్థితులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహచతురతతో అధిగమిస్తారని చెప్పారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని, కేసులకు, జైళ్లకు భయపడే సమస్యే లేదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. బీజేపీ ఎత్తులను తెలంగాణ ప్రజలు చిత్తుచేస్తారని, తమకు ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థపై అపారగౌరవం ఉన్నదని చెప్పారు.