Jogu Ramanna | తాము అధికారంలో ఉన్న సమయంలో అన్నదాతలు ఏండ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేసి వారిని అక్కున చేర్చుకున్నామని బీఆర్ఎస్ నేత జోగురామన్న తెలిపారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రైతు దీక్ష చేపట్టారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద జరిగిన దీక్షలో జోగు రామన్న, ఇతర పార్టీ శ్రేణులతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను పలువురు రైతులు, నేతలు ప్రస్తావించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ…. రైతులకు బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయిందని అన్నారు. రైతుబంధు నగదును రైతుల ఖాతాల్లో ఇప్పటికీ జమ చేయడం లేదని, రైతు కూలీలకు ఆర్థిక సహాయం హామీ సంగతేంటని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టి వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.