Harish Rao : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి సీఎం రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు యత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ స్కామ్ను బయటపెట్టిన తమ పార్టీపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2025 మే నెలలో సైట్ సర్టిఫికెట్ నిబంధన వచ్చిందని, ఆ నిబంధన తొలి లబ్ధిదారు సీఎం బంధువు, శోధా కన్స్ట్రక్షన్ యజమాని సృజన్రెడ్డి అని హరీశ్రావు చెప్పారు. ఆ తర్వాత అన్ని టెండర్లకు సైట్ విజిట్ నిబంధన పెట్టారు. ప్రతి టెండర్కు ప్లస్ టెన్ పద్ధతి ఫాలో అయ్యారు. స్కామ్లు జరగలేదని నమ్మించేందుకు భట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నైనీ కోల్ బ్లాక్ ఒక్కటే కాదని, పారదర్శకత, నిజాయతీ ఉంటే సైట్ విజిట్ నిబంధన పెట్టిన అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
2025 మే నెల నుంచి ఎన్ని టెండర్లు పిలిచారో.. ఎంత మందికి సర్టిఫికెట్ ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని, కావాల్సిన వారికే ఇచ్చారని జీసీసీ, మహాలక్ష్మి వంటి అనేక కంపెనీలు ఫిర్యాదు చేశాయని తెలిపారు. తన వద్ద ఫొటోలు, వీడియోలు, మెయిల్స్ ఉన్నాయన్నారు. విచారణకు ఆదేశిస్తే ఆధారాలు ఇస్తానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అవన్నీ బయటపెడతానని హరీశ్రావు హెచ్చరించారు.