హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల్లో చీలికతెచ్చే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ విమర్శించారు. పాలకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యోగసంఘాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగుల డీఏ, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మూడు డీఏలను తక్షణం చెల్లిస్తామని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చెప్పిందని, కానీ మూడు నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని, ప్రస్తుతం నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, చాలామందికి మొదటి తేదీనాడు జీతాలు రావడమే లేదని తెలిపారు. ఉద్యోగ సంఘాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవం ఇచ్చిందని, ఐదు శాతం ఐఆర్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతల్లో ఏమీలేదని విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి నేడు అర చేతిలో వైకుంఠం చూపుతున్నారని ధ్వజమెత్తారు.
సాగర్ ఎడమకాల్వ కింద ఎండుతున్న పంటలు
నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవడం లేదని దేవీప్రసాద్ ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాళ రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రులు కేసీఆర్ను తిట్టడంలో పోటీపడుతున్నారని, ఇకనైనా ఈ తిట్లు మాని ప్రజల బాగోగులు చూసుకోవాలని హితవు పలికారు. బెంగళూరులాగా హైదరాబాద్ను చేయొద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం.. తాగునీటి సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమేనని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు గజ్జెల నగేశ్, రూప్సింగ్ పాల్గొన్నారు.