హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): శనివారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగుల డీఏ అంశంపై నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మీనమేషాలు లెకపెట్టడం సరికాదని హితవు చెప్పారు. కేవలం ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామంటూ మిగతా సమస్యలు పకన పెడుతున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల మీద లాఠీచార్జి చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన తెస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల పాలన తెచ్చిందని మండిపడ్డారు. ఎన్నికలు ముగియగానే ఎడాపెడా పన్నుల వడ్డనలు మోపడానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రజలపై ఆర్థికభారం మోపాలని చూస్తే సహించేది లేదని, ప్రజలకు అండగా నిలబడి పోరాడుతామని హెచ్చరించారు. రైతులు పండించిన పంటలకు ఇస్తామన్న రూ.500 బోనస్కు షరతులు పెడితే రైతులు కాంగ్రెస్ను బొందపెడతారని హెచ్చరించారు. సన్నవడ్లకు మాత్రమే కాకుండా రైతులు పండించిన ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన అంశాలన్నింటినీ ప్రస్తుతం అమలు చేయాలని చూస్తున్నదని దేవీప్రసాద్ ఆరోపించారు. కేసీఆర్ హయంలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయని గగ్గోలు పెట్టిన రేవంత్రెడ్డి, ఇపుడు ప్రజలపై రిజిస్ట్రేషన్ చార్జీల భారం మోపబోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మొద్దంటూ నాడు నీతులు చెప్పి, నేడు భారీగా భూముల అమ్మకానికి తెరలేపబోతున్నారని ఆరోపించారు. పన్నుల ఆదాయం భారీగా పెరిగిందని గణాంకాలు చెప్తున్నా, ప్రజలపై మరిన్ని భారాలు మోపే విధంగా ముఖ్యమంత్రి ఆలోచించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ పేర్కొన్న గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్కుమార్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పకనపెట్టిన రేవంత్రెడ్డి.. ప్రజలపై పన్నులు ఏవిధంగా వేయాలనే విషయాలపై సమీక్ష చేస్తున్నారని విమర్శించారు. వెంటనే రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీ యింబర్స్మెంట్ విషయంలో అలసత్వాన్ని వెంటనే విడనాడాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.