హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానం ఢిల్లీలో కుస్తీ.. హైదరాబాద్లో దోస్తీ అన్నట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉన్నదని అన్నారు. అబద్ధాల పునాదుల మీద రేవంత్ రాజకీయం చేస్తున్నారని, ఆయన అహంకారమే ఆభరణంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం దావోస్లోనైనా రేవంత్ చిల్లరగా వ్యవహరించడం మానలేదని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్తో కలిసి శ్రవణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయానికి వేదికగా దావోస్ పర్యటనను రేవంత్రెడ్డి వాడుకున్నారని, రాష్ట్ర ప్రతిష్టను పెంచుకోవడంకంటే కూడా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకొనేందుకే ఆయన తాపత్రయపడ్డారని విమర్శించారు. భాష ఎలా మాట్లాడినా ఫర్వాలేదు కానీ భావం కూడా సరిగ్గా లేదని అన్నారు. ఉన్నత చదువులు చదివిన మంత్రి శ్రీధర్బాబును సీఎం రేవంత్ తకువ చేసి చూపారని తెలిపారు. కేటీఆర్ ఐటీ మంత్రిగా రాష్ట్ర ఐటీ ఎగుమతులను రూ.57 వేల కోట్ల నుంచి రూ.2.40 లక్షల కోట్లకు పెంచారని, ఐటీలో మూడు లక్షల నుంచి 10 లక్షలకు ఉద్యోగాలు పెంచిన ఘనత కేటీఆర్దేనని చెప్పారు.
దావోస్ వేదిక మీద సీఎం రేవంత్ అన్నీ అబద్ధాలే చెప్పారని, రైతుల ఆత్మహత్యలపై అంతర్జాతీయ నేతలను తప్పుదోవ పట్టించారని శ్రవణ్ మండిపడ్డారు. దావోస్లో రైతుభరోసాతో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నట్టు తప్పుడు మాటలు చెప్పారని విమర్శించారు. కానీ ఇంతవరకూ రైతు భరోసా అమలు చేయలేదని తెలిపారు. కేటీఆర్ అంతటి నేతను పట్టుకొని డూప్లికేట్ అంటారా? అంటూ రేవంత్పై ధ్వజమెత్తారు. అదానీ గురించి రాహుల్ పార్లమెంట్లో రోజుల తరబడి గంటలకొద్దీ ఆరోపణలు, విమర్శలు చేశారని, దేశాన్ని లూటీ చేస్తున్నారంటూ అదానీ వ్యవహారాలపై రాహుల్ కొట్లాడారని, జేపీసీ, సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్ చేశారని గుర్తుచేశారు.
అదానీతో కలిసి ప్రధాని మోదీ విమానంలో ప్రయాణం చేసిన ఫొటోను కూడా రాహుల్ విడుదల చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు రేవంత్.. అదానీతో కలిసిపోయారని, మోదీని కలిసిన తర్వాత అదానీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. అదానీని రాహుల్ తిట్టడమేమిటి? రేవంత్ ఆయనతో రూ.12వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడమేమిటి? అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అదానీతో కుదుర్చుకొన్న ఒప్పందంలో రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటు ఉన్నదని, అదానీకి రక్షణ రంగం పరిశ్రమల స్థాపనలో ఏం అనుభవం ఉన్నదని రాహుల్గాంధీ స్వయంగా ప్రశ్నించారని దాసోజు గుర్తు చేశారు. రాహుల్ అలా మాట్లాడితే.. రేవంత్ అదానీతో రక్షణ పరిశ్రమల ఏర్పాటుపై ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారని ప్రశ్నించారు.
మోదీ చేతిలో తోలుబొమ్మలా రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దావోస్లో అదానీ కలిసేందుకు ప్రయత్నించినా కేటీఆర్ తిరసరించారని గుర్తుచేశారు. ఊరు, పేరు లేని కంపెనీతో రేవంత్ రూ.8 వేల కోట్ల పెట్టుబడిపై ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారని నిలదీశారు. కేటీఆర్ దావోస్ టూర్లో కుదిరిన ఒప్పందాలను తిరిగి రేవంత్ వల్లెవేస్తూ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ కుదుర్చుకున్న రూ.20 వేల కోట్ల ఒప్పందాలు పాతవేనని స్పష్టం చేశారు. టీడీపీ జెండాల రెపరెపల మధ్య రేవంత్ బీఆర్ఎస్ను బొంద పెడతానని లండన్లో అన్నారని, తెలంగాణ ప్రజలు రేవంత్ తీరును గమనిస్తున్నారని తెలిపారు.