Dasoju Sravan | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం పోయిందా…? అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. కొండంత రాగం తీసి రేవంత్ పాట పడినట్లుగా ప్రజాకోర్టు ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రజా కోర్టు ఓ అట్టర్ ప్లాప్ షో ఆయన అన్నారు.
బాహుబలి సెట్టింగ్ వేసి, పులకేశి సినిమాను చూపించిన రేవంత్, తిరగబడటం తరిమికొడదాం అనేది ప్రజాస్వామిక సిద్ధాంతమా? లేక తెలంగాణ నయా నయీమ్ రేవంత్ తీవ్రవాదమా? అంటూ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. రేవంత్ కాంగ్రెస్ ఓట్ల పోరాటంలో ఉందా…? లేక తూటాల పోరాటంలో ఉందా..? అని శ్రవణ్ నిలదీశారు.
తెలంగాణ ప్రజలు మాకు ఓట్లు వేయ్యరని రేవంత్ కాంగ్రెస్ పార్టీ ముందే చేతులెత్తేసిందా..? అంటూ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ప్రజలు లేని ఖాళీ కుర్చీల ప్రజాకోర్టు ఆసాంతం కేసీఆర్పై అక్కసుతో కడుపు మంటలు, కక్కుర్తి అరుపులు, ఊపిరితిత్తులు పగిలేలా ఊకదంపుడు ఉపన్యాసాలు, నిరాధారమైన ఆరోపణలు తప్ప మరేమీ లేదని శ్రవణ్ ఎద్దేవా చేశారు.