హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రజా యుద్ధనౌక గద్దర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వంచించిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం వయోభారంతో ఉన్నా పాదయాత్రలు చేసి, ఆడి, పాడి అసువులు బాసిన గద్దరన్నను, వారి కుటుంబాన్ని ఆ పార్టీ పచ్చి అవకాశవాదంతో విస్మరించిందని ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
2023 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కొరకు గద్దరన్న కూతురును పోటీలో నిలబెట్టి, అధికారం చేజికించుకున్నాక వేరే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం పచ్చి మోసమని ధ్వజమెత్తారు. ఓడలో ఉన్నంత వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు చేరినంక బోడ మల్లయ్య అన్న చందంగా సీఎం రేవంత్రెడ్డి వైఖరి ఉన్నదని పేర్కొన్నారు. అవకాశవాదంతో గద్దరన్న కుటుంబాన్ని విస్మరించి, అవమానించడం నేరమని తెలిపారు. సినిమా అవార్డులతో సంతోషపెట్టి, అసలు రాజ్యాధికారం మాత్రం రాకుండా నయవంచన చేయడం న్యాయమా? అని శ్రవణ్ ప్రశ్నించారు.