Dasoju Sravan | చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి పరమచండాలపు పనులు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. పార్టీలు మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని నిన్నటి దాకా పతివ్రతలా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నిజస్వరూపం చూపిస్తున్నాడని అన్నారు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్మీట్లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
గతంలో వివిధ పార్టీల నేతలు చట్టానికి లోబడి తమ పార్టీలను విలీనం చేసి బీఆర్ఎస్లో చేరితే రేవంత్ రెడ్డి తప్పుబట్టారని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. బీఆర్ఎస్లో చేరిన ఆయా ఎమ్మెల్యేల ఇండ్ల దగ్గర అప్పుడు చావు డప్పులు కొట్టి, వాళ్ల శవయాత్రలు చేసి.. వాళ్లపై భౌతికంగా దాడులు చేయాలని రెచ్చగొట్టిన రేవంత్.. ఇప్పుడు చిల్లర వైఖరికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ వైఖరిపై ఏం సమాధానం చెబుతారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తాను మాట్లాడింది ప్రజలు మరిచిపోతారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారేమో.. కానీ ఈ డిజిటల్ యుగంలో మాట్లాడిన ప్రతి మాట రికార్డు అయ్యి ఉంటుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు దాసోజు శ్రవణ్ ప్రదర్శించారు. ‘ ఒక పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారితే వాళ్లను ఉరి తీసే చట్టాలు కావాలని మీడియా సాక్షిగా గాంధీ టోపీ పెట్టుకుని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోని వాళ్లు ఎవరైనా పార్టీ మారే ప్రయత్నం చేస్తే వాళ్లను కొట్టి చంపుతామని కోమటిరెడ్డి చెప్పారు. వీళ్లిద్దరూ ఇంత పెద్ద ఎత్తున చిలుకపలుకలతో ప్రజలను నమ్మించి మోసం చేశారు.’ అని తెలిపారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దానం నాగేందర్ను పార్టీలో జాయిన్ చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
దానం నాగేందర్, రంజిత్ రెడ్డి.. ఇలా పార్టీ వదిలిపెట్టి వెళ్లే ఎవర్నీ వదిలిపెట్టమని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. పార్టీ కార్యకర్తల చెమట చుక్కలతో ఎన్నికల్లో గెలిచి.. ఇప్పుడు పార్టీ మారిన ఎవర్నీ వదలిపెట్టమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల్లా రాళ్లతో కొడతాం.. శవయాత్రలు చేస్తామని అనమని.. వాళ్లకు రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెబుతామని తెలిపారు. పార్టీ మారిన వారిపై అనర్హత పిటిషన్ వేసి.. వాళ్ల రాజకీయ జీవితానికి సమాధి కడతామని వార్నింగ్ ఇచ్చారు.
పంజాగుట్ట చౌరస్తా దివాన్జీ దగ్గర బీడీలు అమ్ముకునేవాడు అని దానం నాగేందర్పై రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మీడియా ముందు వినిపించారు. దివాన్జీ దగ్గర బీడీలు అమ్ముకునే దానం నాగేందర్తో గాంధీభవన్ దగ్గర బీడీలు అమ్మిస్తావా? అని సెటైర్ వేశారు. పార్టీలు మారిన నేతలపై సీబీఐ కేసులు పెట్టాలని.. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలి, ఉరి తీయాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, పసునూరి దయాకర్.. ఇలా ఇప్పుడు పార్టీ మారిన అందరిపై సీబీఐ కేసులు పెడతావా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వాళ్లపై శవయాత్రలు చేస్తావా? వాళ్లను కూడా రాళ్లతో కొడతావా? వాళ్లపై కూడా ఉరితీసే చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తావా? అని నిలదీశారు. రేవంత్రెడ్డి చెప్పే నీతులు ఒకటి.. చేసేది ఒకటని ఎద్దేవా చేశారు. ఇలాంటి పనికిరాని పనుల వల్ల బీఆర్ఎస్ నష్టపోతదని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదని స్పష్టం చేశారు.
‘హుజూరాబాద్లో మూడు వేల ఓట్లు వచ్చినయ్.. పార్టీ పనైపోయిందని అనుకున్నాం.. అయినప్పటికీ కొట్లాడి గెలిచినం’ అని ఏపీలో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. నీకు మూడు వేల ఓట్లు వచ్చి ఉండొచ్చు.. కానీ మాకు 37 శాతం ఓట్లు వచ్చాయి. 37 శాతం ఓట్లు సాధించిన పార్టీగా.. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పూర్వవైభవం తెచ్చుకుంటుందని స్పష్టం చేశారు. ఇవాళ పార్టీ మారుతున్న వారంతా పశ్చాత్తాపడతారని అన్నారు. బీఆర్ఎస్ను వెన్నుపోటు పొడవాలి.. పార్టీని నష్టపరచాలని అనుకుంటే కుదరదని తెలిపారు.
పొద్దున లేచింది మొదలు తన ప్రభుత్వాన్ని ఎవరో కూలుస్తారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. నీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం ఎవరికీ లేదని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. మీ పార్టీలోనే చాలామంది ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని.. ముందు వాళ్ల సంగతి చూసుకో అని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రభుత్వం కూలిపోతుందేమోనని చిల్లర మల్లర ప్రయత్నాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు ఏ నమ్మకంతో ఓట్లు వేశారో.. వాటిని అమలు చేసి అండగా ఉండాల్సింది పోయి.. అడ్డమైన ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాన్ని, ప్రభుత్వాన్ని చులకన చేసే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.