Chirumarthi Lingaiah | నకిరేకల్ : నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతా.. పోరాడుతానని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తేల్చిచెప్పారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. వారిని కాపాడడంలో ముందుంటానని ఆయన స్పష్టం చేశారు.
నకిరేకల్ పట్టణంలోని జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తూ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పట్ల పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరూ బాధ పడవద్దు, అధైర్యపడొద్దు అండగా ఉంటానని ఆయన తెలిపారు.
రాజకీయంలో గెలుపు, ఓటములు సహజం అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో హామీలను నెరవేర్చి ప్రజలను సంతోషపెట్టాలని కోరారు. నకిరేకల్ పట్టణంలో రూ.16 కోట్ల నిధులు ఉన్నాయి. గ్రామాల్లో కూడా కొన్ని నిధులు ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలని ప్రజల మన్ననలను పొందాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చిరుమర్తి లింగయ్య కోరారు.