హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమూ, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (తానా) కార్యాలయాన్ని వినోద్కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. వైద్యం, ఆరోగ్యం, విద్య ప్రభుత్వ ప్రధాన అజెండా అని, ఆ దిశలోనే ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని వినోద్ కుమార్ తెలిపారు. అనంతరం తానా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వీ రాకేష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీ ప్రసాద్, వైస్చైర్మన్ డాక్టర్ సీహెచ్ జగన్మోహన్రావు ఆధ్వర్యంలో వినోద్కుమార్ను ఘనంగా సన్మానించారు.