జగిత్యాల, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): నృత్యం చేస్తున్నవాడు చేస్తున్నట్టుగానే కుప్పకూలిపోయాడు. దవాఖానకు తరలిస్తుండగానే అనంతలోకాలకు తరలిపోయాడు. శనివారం జగిత్యాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంలో జరిగిన విషాదమిది. ఒక బృందం నృత్యాలు చేస్తూ పద్మనాయక కల్యాణ మండపానికి తరలివస్తుండగా, కొత్త బస్టాండ్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుబం ధు సమితి జగిత్యాల పట్టణశాఖ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ బండారి నరేందర్ నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కార్యకర్తలు వెంటనే బీఆర్ఎస్ ప్రచారరథంలో దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
నరేందర్ మృతదేహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు కే కవిత, ఎల్ రమణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ వసంత, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులు అంజలి ఘటించారు. నరేందర్ భార్య, బీఆర్ఎస్ కౌన్సిలర్ రజనీతోపాటు కుటుంబసభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని వాయిదా వేసి, నరేందర్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. నరేందర్ మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనం కోసం మూడు రోజులుగా శ్రమించిన నరేందర్.. హఠాన్మరణం చెందడం కలచివేసిందని పేర్కొన్నారు.
నరేందర్ మృతి తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే షాక్ అయ్యామని చెప్పారు. 2013లో నరేందర్ తనకు పరిచయమయ్యారని గుర్తు చేసుకున్నారు. పార్టీ పట్ల, పార్టీ ఆశయాల పట్ల పూర్తి అంకితభావంతో పని చేశారని కొనియాడారు. నరేందర్ కుటుంబానికి బీఆర్ఎస్, కార్యకర్తలు, శ్రేణులు అండగా ఉంటారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నరేందర్ మృతి చెందడంతో ఎమ్మెల్యే సంజయ్కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. వారం క్రితం జగిత్యాలలోని ఆరు వార్డులకు సంబంధించిన కార్యకర్తల సమ్మేళనాన్ని విజయవం తం చేయడంలో నరేందర్ కీలకపాత్ర పోషించారు. శనివారం ఉదయం 8 గంటల వరకు కార్యకర్తలతోనే ఉన్న నరేందర్, వారితో కలిసే అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి వచ్చారు. కౌన్సిలర్లు, తోటి రైతులు, కార్యకర్తలతో కలిసి నృత్యం చేస్తూ నరేందర్ కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న సంజయ్కుమార్ హుటాహుటిన దవాఖానకు వచ్చారు. మృతదేహాన్ని చూడగానే సంజయ్కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.