Balka Suman | సీసీసీ నస్పూర్: రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చేస్తూ రాష్ట్ర ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ భవన్లో చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా గడవక ముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు.
ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చారని, వంద రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచి వాగ్ధానాలను నెలవేర్చలేకపోతున్నారని విమర్శించారు. చెన్నూర్లో 45 వేల మందికి ఉద్యోగాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, మండలానికో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తామని చెప్పి, దాని ఊసే ఎత్తడం లేదని అన్నారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకం, అయిల్పాం ఫ్యాక్టరీలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తే వాటిని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారులో ఎన్నికలకు ముందు 7 మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తే రద్దు చేయడం సరికాదని అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపుతో కేసులు, దాడులు చేస్తే సహించేదిలేదని బాల్క సుమన్ హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలతో నీతిలేని రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల కోసం ఎంతటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అవసరమైతే లాఠీ దెబ్బలు తింటామని, జైలు కూడా వెళ్లడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు తమకు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అబద్ధపు ప్రచారాలతో ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్కు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా త్వరలోనే మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సమావేశాలు ఉంటాయని బాల్క సుమన్ తెలిపారు. ఈ నెల 30న బెల్లంపల్లి, ఫిబ్రవరి4న ఎంఎన్ఆర్ గార్డెన్లో చెన్నూర్ నియోజకవర్గం సమావేశం, 5వ తేదీన పద్మనాయక కల్యాణ మండపంలో మంచిర్యాల నియోజకవర్గం సమావేశం ఉంటుందని అన్నారు.