ఎన్నికల తర్వాత కూడా ప్రశాంతంగా ఉండే పాలమూరు పల్లెల్లో ఇదో కొత్త మార్పు. రాజకీయ సెగ.. పగలా మారుతున్నది. పడగ విప్పి కాటేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న వరుస దాడులు, బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పాలమూరు జిల్లాలో 5 నెలల్లో జరిగిన రెండు హత్యలు ప్రతీకార రాజకీయాలకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.
వనపర్తి జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేశ్యాదవ్ను భూతగాదా ముసుగులో హతమార్చిన ఉదంతం మరువకముందే.. ఇప్పుడు మరో హత్య! అదే జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డిని గొడ్డళ్లతో నరికిచంపారు. పాలమూరులో ఫ్యాక్షన్ను తలపిస్తున్న అరాచకీయ రాజకీయానికి సంకేతాలివి.
చిన్నంబావి, మే 23: బీఆర్ఎస్ నేత శ్రీధర్రెడ్డి దారుణ హత్యతో వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం ఉలిక్కిపడింది. మండలంలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన రైతు శేఖర్రెడ్డి, యశోదమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. బొడ్డు శ్రీధర్రెడ్డి (50) మొదటి సంతానం. మరో ఇద్దరు మహేశ్వర్రెడ్డి, శంకర్రెడ్డి వారి కుటుంబాలతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఉమ్మడి కుటుంబానికి 30 ఎకరాల పొలం ఉంది. శ్రీధర్రెడ్డి వివాహం చేసుకోలేదు. గ్రామంలోని తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయం చేస్తూనే బీఆర్ఎస్ పార్టీలో చేరి చురుకైన నేతగా పేరు తెచ్చుకున్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. బుధవారం రాత్రి కల్లందొడ్డి వద్ద మంచంపై నిద్రించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆ వెంటనే గుర్తు తెలియని వ్యక్తులు అక్కడకు చేరుకొని గొడ్డళ్లతో శ్రీధర్రెడ్డిపై దాడిచేసి దారుణంగా హత్యచేశారు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఇంటికివచ్చే కుమారుడు పొద్దెక్కినా రాకపోవడంతో అనుమానించిన తల్లిదండ్రులు ఇంటి పక్కన ఉండే వ్యక్తిని చూసి రమ్మని పంపించారు. అతడు కల్లందొడ్డి వద్దకు వచ్చి చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే వెళ్లి శ్రీధర్రెడ్డి హత్యకు గురైనట్టు అతడి తల్లిదండ్రులకు చెప్పాడు. విషయం క్షణాల్లో పాకిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ నాగభూషణంరావు ఆధ్వర్యంలో డాగ్స్కాడ్ బృందాన్ని రప్పించారు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ దావాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గ్రామంతోపాటు మండలంలోనూ శ్రీధర్రెడ్డి వివాద రహితుడిగా గుర్తింపు పొందారు. ఘర్షణలు, దౌర్జన్యాలకు దూరంగా ఉండేవాడని, అందరితో కలుపుగోలుగా ఉండేవాడని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్న శ్రీధర్రెడ్డి హత్యను గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.
శ్రీధర్రెడ్డి హత్య సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, అభిలాష్రావుతో కలిసి హుటాహుటిన లక్ష్మీపల్లికి చేరుకున్నారు. శ్రీధర్రెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. హత్యకు దారితీసిన పరిస్థితులను కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల ద్వారా తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
వనపర్తి జిల్లా దవాఖానలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత చిన్నంబావి మండలం కేంద్రంలోని వాల్మీకి చౌరస్తాలో శ్రీధర్రెడ్డి మృతదేహంతో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు కొద్దిసేపు ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బీరం, నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, అభిలాష్రావు ధర్నాలో పాల్గొన్నారు. హత్య వెనకున్నది ఎవరైనా, ఎంత పెద్దవారైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
చిన్నంబావి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా అనంతరం శ్రీధర్రెడ్డి మృతదేహంతోపాటు లక్ష్మీపల్లి వరకు దాదాపు 4 కిలోమీటర్లు ముఖ్య నాయకులు కాలినడకన చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ముఖ్య నేతలు అభిలాష్రావు, క్రిశాంక్తోపాటు పలువురు నాయకులు గ్రామం వరకు పాదయాత్రగా చేరుకున్నారు. శ్రీధర్రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, గులాబీ పార్టీ నాయకులు దాదాపు 400 వరకు వీరిని అనుసరించారు. గ్రామానికి చేరుకున్నాక శ్రీధర్రెడ్డి కుటుం బ సభ్యులను కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోనిబ్బరంతో ఉండాలని ఓదార్చా రు. ర్యాలీలో కాంగ్రెస్ డౌన్డౌన్, జూపల్లి డౌన్డౌన్ అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
శ్రీధర్రెడ్డి హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ స భ్యులు, బంధువుల రోదనలు మిన్నంటా యి. సాయంత్రం అశ్రునయనాల మధ్య శ్రీధర్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద ఎత్తున వచ్చిన శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ శ్రేణులు, గ్రామ, మండల ప్రజలు నివాళులర్పించారు. గతంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో హత్యారాజకీయాలు లేవని, కాంగ్రెస్ వచ్చాకే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆగ్ర హం వ్యక్తంచేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లె ల్లో ఇలాంటి హత్యా ఘటనలు చిచ్చు రేపుతున్నాయని మండిపడుతున్నారు.