మంచిర్యాల : క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం అక్రమ కేసులతో జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ( Balka Suman ) , బీఆర్ఎస్ నాయకులు బుధవారం విడుదల కానున్నారు. బెయిల్ పిటిషన్( Bail Petition ) పై సోమవారం వాదనలు విన్న జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.
అయితే చెన్నూర్ కోర్టు ( Chennur Court ) లో ఉన్న మరో కేసులో పీటీ వారెంట్ ఫిటిషన్పై విచారణను ఆ కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. బాల్కసుమన్కు ఈ కేసులోనూ బెయిల్ రావాల్సి ఉండటంతో ఐదో తేదీ తర్వాతే ఆయన జైలు నుంచి బయటికి వస్తారని అంతా భావించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నూర్ కోర్టులో పీటీ వారెంట్ ఫిటిషన్ పై విచారణ జరపాలని బాల్కసుమన్ అడ్వొకేట్లు మరో ఫిటిషన్ వేయడంతో కోర్టు విచారణను స్వీకరించింది. బాల్కసుమన్ తరుపు న్యాయవాదులు వాదనల అనంతరం పెట్టిన కేసు బెయిలెబుల్ అఫెన్స్ కావడంతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో బాల్కసుమన్ సహా ఆయనతో పాటు అరెస్టయిన బీఆర్ఎస్ నాయకులు జైలు నుంచి విడుదల కానున్నారు.
ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశామని, రేపు ఉదయం 7 గంటలకు బాల్కసుమన్ జైలు నుంచి బయటికి వస్తారని ఆయన తరుపు న్యాయవాదులు తెలిపారు. బాల్కసుమన్ బయటికి రానున్న నేపథ్యంలో చెన్నూర్ లో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు.
జైలు నుంచి బయటికి వచ్చిన బాల్కసుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకులను వందలాది వాహనాల్లో ర్యాలీగా క్యాతన్పల్లికి తీసుకురానున్నారు. వచ్చే మార్గంలో మంచిర్యాల జిల్లా పరిధిలోని ప్రధాన రహదారి మార్గాల్లోని పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి సుమన్ పూలమాల వేస్తారని అక్కడి నుంచి నేరుగా క్యాతన్పల్లిలోని తన నివాసానికి చేరుకుంటారని బీ ఆర్ఎస్ నాయకులు తెలిపారు.