దుగ్గొండి, ఏప్రిల్ 8 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన ‘ఉత్తర ఉద్యమం’లో శనివారం మంత్రి పాల్గొని వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఉపాధి హామీ కూలీలతో కలిసి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి సందేశం అందేలా ఉత్తరాలను పోస్ట్బాక్స్లో వేసి, నిరసన తెలిపారు. నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉత్తరాలను చేతపట్టుకొని గ్రామ పంచాయతీల వద్దకు ర్యాలీగా వెళ్లారు. కార్డులను పోస్ట్ డబ్బాలో వేసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహ్మదాపురం గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు.
కేంద్రంలోని మోదీ సర్కారు ఉపాధి హామీ కూలీల కడుపుకొట్టేలా ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్వం చేసే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. దీనిని తిప్పికొట్టి బీజేపీ సర్కారుకు బుద్ధిచెప్పేలా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈజీఎస్ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అసెంబ్లీసాక్షిగా తీర్మానం చేస్తే మోదీ ప్రభుత్వం మాత్రం దానిని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తారు.
దేశంలోని పేదలకు ఉపాధి కల్పించే పథకాన్ని లేకుండా చేసి దేశ ఆదాయాన్ని మాత్రం కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా మారిందని చెప్పారు. అనంతరం గ్రామంలో రూ.4.41కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు, రూ.70 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
పరిహారం అందించే బాధ్యత నాదే: ఎమ్మెల్యే పెద్ది
రాజకీయాలకతీతంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందించే పూర్తి బాధ్యత తనదేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి భరోసా ఇచ్చారు. దుగ్గొండి మండలంలోని 11వేల ఎకరాలకు పరిహారాన్ని రైతులందరికీ చెక్కుల రూపంలో అందిస్తామని వెల్లడించారు. ఉపాధి కూలీల కడుపు కొట్టేలా కేంద్ర చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఏకమై కేంద్రం దిగి వచ్చే వరకూ ఉద్యమం చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే, వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.