రైతు కేంద్రంగా, సాగు బాగు పడటమే లక్ష్యంగా అనేక పథకాలను తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఇది కదా రైతు మాడల్. అందుకే ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ను బీఆర్ఎస్ తన నినాదంగా తీసుకున్నది. తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు చేస్తాం.
ఢిల్లీ, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలో సాగురంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ఈ దశలో తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని భారత రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతువ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని, రైతాంగ వ్యవస్థను ధ్వంసం చేసేలా చట్టాలు చేసిందని ఆయన గుర్తుచేశారు. రైతుల ఆందోళనతో ఆ చట్టాలను రద్దు చేసినా.. రైతువ్యతిరేకత విషయంలో ఆ పార్టీ ఏ మాత్రం వెనక్కిపోలేదని పేర్కొన్నారు. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తున్నదని, కనీస మద్దతు ధర కల్పించే చట్టంపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తున్నదని చడూనీ విమర్శించారు. బీఆర్ఎస్ ఒక చారిత్రక అవసరమని, రైతులపక్షాన పోరాటం చేస్తామని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్నామ్సింగ్ స్పష్టంచేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఎలా ఉంది?
బీజేపీని దేశద్రోహ పార్టీ అనడంలో తప్పేమీ లేదు. దేశ సంపదను ఆ పార్టీ తనకు అనుకూలమైన కొంతమందికి దోచిపెడుతున్నది. తరతరాలుగా భారత ప్రజల ఆస్తిగా ఉన్న నవరత్న కంపెనీలను తన మద్దతుదారులైన బడాపారిశామికవేత్తలకు తెగనమ్ముతున్నది. రైల్వేలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు.. ఇలా అన్నింటినీ వేలం వేస్తున్నది. దేశ సంపదను అమ్ముకునేవాళ్లు కూడా దేశభక్తి అంటూ ప్రచారం చేసుకోవడమే విడ్డూరం. బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు, సంస్థలు ఏమీ చేయకపోయినా ఏదో ఒక బురద చల్లుతారు. కానీ, ఆ పార్టీ అనుకూలురు ఏం చేసినా చెల్లుతాయి. అదానీ పోర్టుల్లో మాదకదవ్యాల ప్రవాహం ఉంది. పట్టుబడుతున్న డ్రగ్స్ రూ.వేలకోట్లల్లో ఉన్నాయంటే, మొత్తంగా ఎంత రవాణా జరుగుతున్నదో అర్థమవుతున్నది. మరి కేంద్రం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. పేదలను కొట్టి, కార్పొరేట్లకు అంటకాగే బీజేపీ విధానాలకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే.
తెలంగాణ మాడల్ రైతులకు ఏ మేరకు ఉపయోగకరం?
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఒక సంచలనం. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పినపుడు మేమంతా ఆశ్చర్యపోయాం. అసలు దీని అమలు సాధ్యమేనా అనే అనుమానం మాకూ ఉండేది. ఎకరానికి ఏడాదికి 10వేలు రైతుకు ఇవ్వడం ఆశామాషీ విషయం కాదు. కానీ, ఎన్నికలు లేని సమయంలో, ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండా రైతుబంధును కేసీఆర్ ప్రకటించి అమలు చేశారు. గత కొన్నేండ్లుగా ఈ పథకం విజయవంతంగా అమలవుతున్నది. మేము తెలంగాణకు వచ్చి ఈ పథకం అమలుపై రైతులతో కూడా మాట్లాడినం. రైతుబంధుతో ఆర్థిక కష్టాలనుంచి, రుణ పీడనల నుంచి వారు బయటడ్డారు. పంట పెట్టుబడి సాయం సమయానికి అందుతున్నది. అలాగే రైతు ఏ కారణంతో మరణించినా, ఆయన కుటుంబానికి రైతుబీమా అందజేస్తున్నారు. కేవలం 15 రోజుల్లోనే ఆ పరిహారం కుటుంబానికి చేరుతున్నది. బీమా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇది అన్నదాతల కుటుంబాల్లో ఆర్థిక భరోసాను నింపుతున్నది. మేం తెలంగాణలో పర్యటించినప్పుడు రైతు కుటుంబాల ఇదే విషయాన్ని చెప్పాయి.
బీఆర్ఎస్ చెప్తున్న వాటర్పాలసీ అవసరం ఏమిటి?
దేశానికి నీటి విధానం (వాటర్ పాలసీ) ఉండాలి. పుష్కలమైన నీటి వనరులు ఉన్నా సరిగ్గా వాడుకోలేకపోతున్నాం. ఒకవైపు 72వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. మరోవైపు నీటి వసతి లేక భూములు బీడుగా మారుతున్నాయి. రాష్ర్టాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. దేశంలోని ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోవాలి. అందుకు మాటలు చెప్తే సరిపోదు. కార్యాచరణ కావాలి. ప్రాజెక్టులు కట్టాలి. సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలి. ఇలా తీరినప్పుడే మన దేశం ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండగలుగుతుంది. వనరులు ఉండీ వినియోగించుకోలేని అసమర్థ నాయకత్వాలతో దేశం, రైతాంగం ఇప్పటివరకు అవస్థపడుతున్నది. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా నీటి వినియోగంపై సమగ్ర ప్రణాళికను రూపొందించుకోలేకపోవడం దుర్మార్గం. తెలంగాణలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు అద్భుతం. కేవలం 8 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు కట్టారు. ఈ తరహా కార్యాచరణ దేశానికి అవసరం. దీని కోసమే బీఆర్ఎస్ పోరాడుతుంది. స్పష్టమైన వాటర్పాలసీని ప్రకటించి, కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం.
దళితుల స్వావలంబనకు మీ ప్రణాళిక ఏమిటి?
దేశంలో అత్యంత వెనుకబడిన దళిత ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణలో అమలవుతున్న దళితబంధు తరహా పథకం కావాలి. దళితులను కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూశారు. వారి ఆర్థిక స్వావలంబనకు ఇప్పటివరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నం అంతంత మాతమే. బీఆర్ఎస్ దళితుల సామాజిక అభివృద్ధి, వారి సాధికారత కోసం నిబద్ధతతో పనిచేస్తుంది.
తెలంగాణ సాధించిన విజయాలను మీరెలా చూస్తున్నారు?
రైతులందరికీ 24గంటల నిరంతరాయ కరెంటును తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. అది కూడా పూర్తి ఉచితంగా. ఇలా సాగుకు ఉచిత విద్యుత్తును ఇస్తున్న మరో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. నీటిపారుదల ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తిచేసి ఉచితంగా కాలువల ద్వారా పంటలకు నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఇక పండిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. మార్కెట్ సదుపాయాలు మెరుగుపడ్డాయి. గోదాములు వచ్చాయి. ఎరువులు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలకు సంబంధించిన పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి 5వేల ఎకరాలను ఒక కస్టర్గా పరిగణిస్తూ, వ్యవసాయ అధికారులను నియమించారు. రైతువేదికలను ఏర్పాటు చేశారు. కల్లాలను నిర్మించారు. ఇలా రైతు కేంద్రంగా, సాగు బాగుపడడమే లక్ష్యంగా అనేక పథకాలను తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఇది కదా రైతు మాడల్.
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదానికి కారణమేంటి?
దేశవ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారమే మా ఎజెండా. అందుకే ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ బీఆర్ఎస్
తన నినాదంగా తీసుకున్నది. తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు తెలంగాణను మాడల్గా తీసుకుని కొన్ని కార్యక్రమాలను రూపొందించుకున్నాయి. అయితే సంపూర్ణంగా అమలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన్ కింద ప్రతి రైతుకు గరిష్ఠంగా రూ.6వేల వరకు సహాయం చేస్తున్నది. అయితే ఇది సరిగ్గా అమలు కావడం లేదు.