నల్లగొండ: రానున్న రోజుల్లో బీఆర్ఎస్(BRS) జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నదని దేవరకొండ శాసన సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన 120మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్(BRS) సర్కార్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో బీఆర్ఎస్ ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు.
ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. గ్రామాల్లో గతంలో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళతో దర్శనమిస్తున్నాయని అన్నారు.మారుమూల గ్రామాల్లోనూ ఇంటింటికీ మిషన్ భగీరథ(Mission Baghiratha) పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతున్నదని అన్నారు.
ప్రతీ పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. గ్రామాల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్ధిక భరోసా కల్పిస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్ రావు, మండల ప్రధాన కార్యదర్శి ఉజ్జిని నరేందర్ రావు, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఉజ్జిని నర్సింహరావు, వింజమురి రవి, ఉజ్జిని రఘు రావు, ఉడుత అక్రమ్ యాదవ్, వేముల రాజు, బోడ్డుపల్లి కృష్ణ, శిమర్ల శ్రీను పాల్గొన్నారు.