ఖమ్మం, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా కదం తొక్కింది. ఉద్యమ సారథి, గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికింది. బస్సుయాత్రలో భాగంగా సోమవారం రాత్రి చేరుకున్న బీఆర్ఎస్ అధినేతకు జిల్లా జనం నీరాజనం పలికింది. జిల్లా సరిహద్దు గ్రామమైన తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం నుంచి అశేష జనవాహిని ఎదురేగి వచ్చి ఆయనను అనుసరించింది. యాత్ర ఖమ్మం నగరంలోకి ప్రవేశించగానే ప్రవాహంలా జనం తరలివచ్చారు. కిలోమీటర్ల పొడవున పార్టీ శ్రేణులు, అభిమానులు తమ అధినేతకు అద్భుత స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా మార్గాల వద్ద వేచి ఉన్నారు. కేసీఆర్ను కనులారా చూసేందుకు మధ్యాహ్నం 3 గంటల నుంచే వరంగల్ క్రాస్రోడ్డు, కాల్వొడ్డు, నయాబజార్, మయూరి సెంటర్, పాత బస్టాండ్ సెంటర్, పాత ఎల్ఐసీ ఏరియా, జడ్పీ సెంటర్ ప్రాంతాల్లో వరుసగట్టారు. ఇసుకేస్తే రాలనంత జనం తమ కేసీఆర్ కోసం ఎదురుచూశారు.
కాల్వొడ్డు వద్ద ఘనస్వాగతం
కాల్వొడ్డు వద్ద పార్టీ అధినేతను బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియ, మదన్లాల్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ఘనస్వాగతం పలికారు. మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ హారతులు పట్టారు. వరంగల్ క్రాస్రోడ్డు నుంచి జడ్పీ సెంటర్ వరకు అధినేత బస్సును కార్యకర్తలు, అభిమానులు అనుసరించారు. ‘జై కేసీఆర్..’ అంటూ నినదించారు. ఈ క్రమంలో బస్సులోంచి అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు కలిలారు.
రాలేదు.. అందలేదు..
‘కాంగ్రెస్ పాలనలో తులం బంగారం, కల్యాణలక్ష్మి వస్తుందా? రైతుబంధు అందరికీ అందిందా? మహిళలకు రూ.2,500 వచ్చాయా?’ అంటూ వేదికపై నుంచి కేసీఆర్ ప్రశ్నించగా, ‘రాలేదు.. అందలేదు’ అని చెబుతూ ప్రజలు పెద్ద ఎత్తున చేతులు పైకెత్తి చెప్పారు. ఉద్యమ సమయంలో ఖమ్మం తనను ఆదరించిందని, ఆమరణ దీక్షకు పూనుకున్న తనను ఖమ్మం జైల్లో వేస్తే ఇక్కడి రాజకీయ పక్షాలు, ఉద్యమకారులు తనను కంటికి రెప్పలా కాపాడుకున్నారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. గడిచిన పదేండ్లలో జిల్లాలో అభివృద్ధిని, బీఆర్ఎస్ ముందుచూపును గుర్తుచేశారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర తొలి రోజు ఐదు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ యాత్ర పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. పార్టీ అధినేత కేసీఆర్ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని ఆసాంతం వినేందుకు తరలివస్తున్న పార్టీ శ్రేణులకు పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పలేదు. అనేక చోట్ల రహదారులకు అడ్డంగా బారికేడ్లు, వాహనాలు అడ్డుపెట్టారు. ప్రధాన రహదారులపైకి పార్టీ శ్రేణులు రాకుండా అడ్డుకున్నారు.
ఖమ్మం నగరం.. గులాబీమయం
కేసీఆర్ రాకతో ఖమ్మం నగరం గులాబీమయమైంది. పిల్లలు, వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘మా బాపూ కేసీఆర్..’ అంటూ నినదించారు. దాదాపు గంటన్నరపాటు జిల్లా కేంద్రంలో కేసీఆర్ బస్సుయాత్ర కొనసాగింది. సుమారు అరగంటపాటు ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, బీజేపీ చర్యలను తన ప్రసంగంలో తూర్పారబట్టారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగానికి అనూహ్య స్పందన లభించింది. బస్సుపై భాగానికి కేసీఆర్ చేరుకోగానే.. ‘సీఎం.. సీఎం..’ అన్న నినాదాలు హోరెత్తాయి. కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో తమకు రైతుబంధు రావడం లేదంటూ రైతులు ఏకరువు పెట్టారు. ఇందుకు ఆయన ప్రతిస్పందించారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని గుర్తు చేస్తూ కాంగ్రెస్పై విమర్శనాస్ర్తాలు సంధించారు. బీజేపీ ప్రభుత్వం పనైపోయిందని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించుకుంటే కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ చెప్పారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు ప్రకటించారు. నామా ప్రజల మనిషని, ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆరాటం ఆయనకు ఉంటుందని అన్నారు.