‘మేడిగడ్డ కుంగింది. అన్నారం పగిలింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతమాత్రం పనికిరాదు. లక్షల కోట్లు వృథా.’
-ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాట.
‘కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు. పదుల సంఖ్యలో 15 రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాలువలు, వందల కిలోమీటర్ల సొరంగాలు. పదుల సంఖ్యలో పంప్హౌస్లు. అన్నింటి సమూహం ప్రాజెక్టు. అయినా రాజకీయ దురుద్దేశంతోనే ప్రాజెక్టుపై బుదరజల్లే కుట్ర చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేపట్టడకుండా మొత్తంగా ప్రాజెక్టునే మూలనపడేసే కుట్రను సర్కారు అమలు చేస్తున్నది.’
-ఇది బీఆర్ఎస్ వాదన.
‘ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు సహజం. వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును వదిలేస్తారా? అది ప్రజల ఆస్తి. కారణాలను అన్వేషించాలి. ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలి. అది ప్రభుత్వం తక్షణ కర్తవ్యం.’
-ఇది ఇంజినీరింగ్ నిపుణుల సూచన.
Kaleshwaram | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా ఏం జరిగింది? ఏ మేరకు నష్టం వాటిల్లింది? ఏం జరుగుతున్నది? ప్రాజెక్టు పనికిరాదా? లక్షల కోట్లు వృథాయేనా? ప్రాజెక్టును పునరుద్ధరించుకోవచ్చా?’ ఇవి యావత్ తెలంగాణ సమాజం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ప్రచారంలో వాస్తవమెంతా? తక్షణ కర్తవ్యం ఏంటి?’ అనే వాటిపై చర్చించాలనేది తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల డిమాండ్.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా గత మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అపోహలు. అసత్య ప్రచారాలు. సరిగ్గా అలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ ‘చలో మేడిగడ్డ’ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ నిర్ణయంపై విశ్రాంత ఇంజినీర్లు, తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టుపై నిజనిర్ధారణ జరగాలని, వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు.
కాంగ్రెస్, పలు పార్టీల నేతల బృందం సందర్శన
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో 7వ బ్లాక్లోని 20వ నంబర్ పిల్లర్ గత అక్టోబర్లో కుంగుబాటునకు గురవ్వడంతో మొత్తం ప్రాజెక్టుపైనే అనుమానాలు రేకెత్తేవిధంగా ప్రచారం కొనసాగుతున్నది. కుంగుబాటునకు కారణాలను అన్వేషించకుండా, పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా, అవి పూర్తయి నివేదికలు రాకముందే ఒకవైపు ఎన్డీఎస్ఏ, మరోవైపు విజిలెన్స్ బృందం ప్రాజెక్టుపై పుకార్లకు ఊతమిచ్చేలా నివేదికలను విడుదల చేస్తున్నాయి.
వాటిని సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభు త్వం అదే తరహా ప్రచారానికి తెరలేపింది. తొలుత రాష్ట్ర మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ఒకసారి, ఆ తర్వాత మరోసారి మంత్రులు, కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేల బృందంతో ప్రాజెక్టును విజిట్ చేశారు. మళ్లీ అవే ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలను బయటపెట్టారు తప్ప ప్రాజెక్టు ఘటనకు సంబంధించి, ప్రస్తుతం చేపట్టాల్సిన పనుల గురించి ఏ వివరాలూ వెల్లడించలేదు. 20వ పిల్లర్ ఫొటోలనే మీడియాకు విడుదల చేస్తూ సమాజాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
ప్రాజెక్టు ప్రజల ఆస్తి
రాజకీయాలు ఎలా ఉన్నా ప్రాజెక్టు అనేది ప్రజల ఆస్తి. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది, గోదావరి జలాలను మళ్లించింది, తద్వారా చివరి మడి వరకు తడి అంది పంటలు పండింది వాస్తవం. ఇప్పుడు అలాంటి భారీ ప్రాజెక్టులో ఒక భాగమైన బరాజ్లో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టునే బద్నాం చేసేందుకు యత్నిస్తున్నది.
వాస్తవంగా ప్రాజెక్టులో జరిగింది ఏమిటి? కుంగుబాటుకు కారణాలు ఏమిటి? తక్షణం చేపట్టాల్సిన నివారణ చర్యలు ఏమిటి? శాశ్వత పరిష్కారమార్గాలు ఏమిటి? ప్రాజెక్టును తిరిగి ఎలా వినియోగంలోకి తీసుకువస్తారు? అనే అంశాలపై చర్చ కొనసాగుతున్నది. ఆయా అంశాలపై రాజకీయాలకతీతంగా, రైతాంగం, సమాజ సంక్షేమం దృష్ట్యా నిజనిర్ధారణ కొనసాగాలని తెలంగాణ మేధావి వర్గం, పౌర, ప్రజాసంఘాలు, ఇంజినీరింగ్ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం పట్ల అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి.
రేపు బీఆర్ఎస్ బృందం సందర్శన
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించనున్నది. ఈ బృందం ఉదయమే తెలంగాణభవన్ నుంచి బయలుదేరనున్నది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్యనాయకులు తరలివెళ్లనున్నారు. దాదాపుగా 150 నుంచి 200 మంది వరకు బృందంలో ఉంటారని అంచనా. మీడియా ప్రతినిధులను, నిపుణులను తీసుకెళ్లనున్నారు. మేడిగడ్డ బరాజ్పై ప్రభుత్వ దుష్పప్రచారాన్ని తిప్పికొట్టాలని నల్లగొండ సభలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడిగడ్డ పర్యటనను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు.
నేడు విశ్రాంత ఇంజినీర్ల సమావేశం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ప్రాజెక్టు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించాలని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం నిర్ణయించింది. దీనిపై శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నది.
మేడిగడ్డను రిపేర్ చేస్తాం: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
ఎన్డీఎస్ఏ సిఫారసులు, సూచనలు చేసిన అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మరమ్మతులు చేపట్టిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలు, పంప్హౌస్లను వినియోగంలోకి తీసుకువస్తామని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ‘చలో మేడిగడ్డ’ పిలుపు రాజకీయ గిమ్మిక్కు అని విమర్శించారు. జలసౌధలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే బీఆర్ఎస్ నేతలకు అన్నీ చూపాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కాళేశ్వరం ద్వారా ఐదేండ్లపాటు 65 టీఎంసీల నీటితో 6.5 లక్షల ఆయకట్టును స్థిరీకరించారని చెప్పారు.ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
ఉద్యమ ఫలాలను కాపాడుకోవాలి
కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు. 40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఇంటిగ్రేటెడ్ నిర్మాణ సమూహం. కేసీఆర్పై కక్షతో ప్రాజెక్టును బలి చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బలిచేస్తే నాటి కరువు పరిస్థితులనే తెలంగాణ చవిచూడాల్సి వస్తుంది. ఉద్యమ ఫలాలను తెలంగాణ కాపాడుకోవాలి. కేటీఆర్, హరీశ్రావు ప్రాజెక్టు సందర్శనకు నడుంకట్టడం అభినందనీయం.
-వీ ప్రకాశ్, మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్
నిజనిర్ధారణ జరగాలి
మేడిగడ్డ ప్రాజెక్టును కాపాడటం ప్రాథమిక అంశం. అవినీతి, విచారణ మరొక అంశం. ఆ రెండింటిని వేరు చేసి చూడాలి. ప్రాజెక్టుపై నిజనిర్ధారణ జరగాల్సిందే. ప్రాజెక్టు కట్టింది నిజం. నీళ్లు పారించింది నిజం. పంటలు పండింది నిజం. కానీ రాజకీయాల కోసం ప్రాజెక్టును వాడుకోవద్దు. ప్రాజెక్టు పునరుద్ధరణపై తక్షణ చర్యలు చేపట్టాలి.
– ఘంటా చక్రపాణి, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్