సికింద్రాబాద్, అక్టోబర్ 6: సీఎం కేసీఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఐసీసీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐసీసీ రాష్ట్ర చైర్మన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో గురువారం జరిగిన తెలంగాణ క్రైస్తవ నాయకుల మహాసభలో 33 జిల్లాల క్రైస్తవులు, నాయకులు, పాస్టర్లు, బిషప్లు ఏకగ్రీవంగా తీర్మానంచేశారు. త్వరలో 33 జిల్లాల ముఖ్య నేతలంతా ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలుస్తామని తెలిపింది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు అనుకూలంగా ప్రచారం నిర్వహించేందుకు విధి విధానాలపై చర్చించనున్నామని బిషప్ భాస్కర్ ముల్కల ప్రకటించారు. దేశవ్యాప్తంగా 25- 30శాతం పైగా దళిత, క్రైస్తవ, మైనారిటీ ఓట్లు ఉన్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా అన్ని క్రైస్తవ సం ఘాల సమాహారంతో ‘భారత క్రిస్టియన్ కౌన్సి ల్’ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నామని, 200 మంది వివిధ సంఘాల అభిప్రాయంతో తీర్మానం చేశామన్నారు. నవంబర్ 14న అని రాష్ర్టాల క్రైస్తవ సీఎంలతో పరేడ్ గ్రౌండ్లో బీఆర్ఎస్కు మద్దతుగా క్రైస్తవ మహా సభను 10 లక్షల మందితో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. గజ్వేల్, సిద్దిపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే కోకాపేటలో పూర్తవుతుందని గజ్వేల్ పాస్టర్ ఫెలోషిప్ రూబేను తెలిపారు. కార్యక్రమంలో ముల్కల ప్రవీణ్, బిషప్ దుర్గం ప్రభాకర్, పాస్టర్ చక్రిపాల్, ప్రసాద్, సుదీర్ చాటల్ల, బెంజమిన్ రాజు పాల్గొన్నారు.