ఆర్మూర్(నిజామాబాద్) : బీఆర్ఎస్(BRS) అంటే ఓట్ల కోసమో, సీట్ల కోసమో రాత్రికి రాత్రి పుట్టిన పార్టీ కాదని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి(Mla Jeevan Reddy) అన్నారు.ఆరు దశాబ్దాల ఆంధ్రా బానిసత్వ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకు పుట్టిన ఉద్యమ సంస్థని, తెలంగాణ ప్రజలు త్యాగాలతో నిర్మించుకున్న రాజకీయ వారధని పేర్కొన్నారు.
ఆదివారం ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆర్మూర్ మండల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ మూల సిద్ధాంతమని స్పష్టం చేశారు. కేసీఆర్(KCR) చావునోట్లో తలపెట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత, అభినవ గాంధీ అని అభివర్ణించారు. ప్రజల మనసు దోచుకునేలా ఆదర్శపాలన సాగిస్తూ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ప్రశంసించారు.
కేసీఆర్ను దేశ ప్రధాని(Prime Minister)గా చూడాలన్నదే తన జీవితాశయమన్నారు.లక్షలాధిగల గులాబీ సైన్యం ఒక్కసారి చప్పట్లు కొడితే ఆ సౌండ్ కే బీజేపీ, కాంగ్రెస్ లు కొట్టుకుపోతాయని పేర్కొన్నారు.జామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు(Haldi Board) తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ అరవింద్(MP Aravind) మాట తప్పి రైతులకు పంగనామాలు పెట్టారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) పరీక్షాపత్రాలు లీక్ చేసి విద్యార్థులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ను చూసి బీజేపీ వణుకుతోందని దీంతో బీఆర్ఎస్ నాయకులపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు జరుపుతోందని స్పష్టం చేశారు. కేసీఆర్తో గోక్కున్నోడెవడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదని అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రజిత రెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. పార్టీ జిల్లా ఇన్చార్జి , శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ ,రాజ్య సభ సభ్యులు కె ఆర్ సురేశ్రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, టీఎస్ డబ్ల్యూసీ డీసీ చైర్ పర్సన్ ఆకుల లలిత, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ మధు శేఖర్, కోటపాటి నరసింహ నాయుడు, సీనియర్ నాయకుడు రాజారాం యాదవ్ పాల్గొన్నారు.