Marri Chettu tanda | మర్రిచెట్టు తండాకు ఇప్పుడు సర్కారు పథకాలే చెట్టంత అండ. బిడ్డ పెండ్లి చేయలేనేమో అన్న శాంతమ్మ అశాంతిని ‘కల్యాణ లక్ష్మి’ పథకం దూరం చేసింది. ఆ పైసలతో పది మేకలు కోసి.. తండాకంతా దావత్ కూడా ఇచ్చింది. తొంభై ఏండ్ల నీల.. ఇందిరమ్మ మొదలు ఎంతోమంది పాలకులను చూసింది. కానీ, కేసీఆర్ సర్కారుతోనే తమ కష్టాలు తీరాయని చెబుతున్నది. ఆ తండాల ప్రజల గుండె చప్పుడు మీరూ వినండి.
‘మా తండా.. మా జెండా’ నినాదాన్ని నిజం చేస్తూ కేసీఆర్ సర్కారుతండాలను పంచాయతీలుగా మార్చిన తర్వాత గిరిజనుల జీవితాల్ల్లో సంతోషం పొంగి పొర్లుతున్నది. అనేకానేక గండాలు దాటుకున్న తండాల మెడలను అభివృద్ధి దండలతో అలంకరించింది మన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న శుభ సమయంలో ‘ప్రగతి ఫలాలేవీ’ అంటే.. ‘ఇవిగో..’ అంటూ తండాలే సమాధానమిస్తున్నాయి.గ్రామ పంచాయతీలుగా గుర్తించిన తర్వాత అక్కడి అభివృద్ధి, గిరిజనుల జీవితాల్లో వచ్చిన మార్పులపై ప్రత్యేక కథనం..
పదిహేనేండ్ల క్రితం.. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే భాగం. 2008.. ఉద్యమ నాయకుడు కాలికి బలపం కట్టుకొని పల్లెలు, గూడేలు, తండాలు తిరుగుతున్న సమయం. ఒకవైపు ఉద్యమ సెగలు రగులుతున్నాయి.. మరోవైపు ఎండలు నిప్పులు కక్కుతున్నాయి. ఏప్రిల్ 11.. మహబూబ్నగర్ జిల్లా, బాలా నగర్ మండలంలోని నేలబండ తండాలో కేసీఆర్ బస. మరుసటిరోజు పొద్దున్నే లేచి తండా మొత్తం తిరిగారు. తండావాసుల గోసలు విన్నారు. ఆ కష్టాలకు కలత చెందారు. రోడ్లు లేవు, నీళ్లు ఉండవు, కరెంటు రాదు… ఒక్కమాటలో చెప్పాలంటే అసలు అభివృద్ధే లేదు. ఆ క్షణంలో కేసీఆర్ గిరిజనులకు చెప్పిన మాట ఒకటే.. ‘తెలంగాణ తెస్తా.. తండాల తలరాతలు మారుస్తా’. మొక్కవోని దీక్ష.. బిగి సడలని పట్టుదలతో ఉద్యమాన్ని ఉధృతం చేసి.. కోట్లాది ప్రజల కల నెరవేర్చారు కేసీఆర్. తండాలను పంచాయతీలుగా చేస్తానని గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
ఇక, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతం తండాల దైన్యం చెప్పనలవి కాదు. నవమాసాలు మోసి కన్న బిడ్డలను సాకే శక్తి లేక అంగట్లో బొమ్మల్లా అమ్ముకునే దుస్థితి. జన్మనిచ్చేందుకు శక్తి చాలక.. పోషకాహార లోపంతో పురిట్లోనే ప్రాణాలు కోల్పోయిన తల్లులు అనేకమంది. ఇక బిడ్డల సంగతి చెప్పనక్కర్లేదు. చేసేందుకు పని దొరికేది కాదు. అడ్డా మీద గంటల కొద్దీ నిలబడాల్సిందే. అదృష్టం బావుంటే..సాయంత్రానికి రెండుమూడొందల కూలీ చేతిలో పడుతుంది. సాగు చేసుకుందాం అనుకున్న రైతులకు.. దున్నకాలతో మొదలైన అప్పులు విత్తు నాటి, పైరు ఎదిగి పంట చేతికొచ్చే సమయానికి కుప్పలా మారిపోయి ధాన్యపు కుప్పను మింగేసేవి.
రుణబాధలు తాళలేక.. ఉసురు తీసుకున్నవాళ్లు కొందరైతే, ఊరు విడిచి పట్నం వలసొచ్చిన వాళ్లు చాలామంది. ఆపదొచ్చి.. ఊరు దాటేందుకు రోడ్డు లేక.. దారిమధ్యలోనే ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి. ఆడబిడ్డ పెండ్లి మోయలేనంత బరువైపోయేది. అందుకే, ఆడపిల్ల పుడితే.. అమ్మేయడమో, పురిట్లోనే చంపేయడమో, చెత్తకుప్పల్లో విసిరేయడమో! కానీ… ఇప్పుడు పరిస్థితి మారింది. తండాల తండ్ల్లాట తీరింది. తెలంగాణ మూలమూలకూ ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న నోర్లకు.. తండాలే సమాధానం చెబుతున్నాయి.
తండాల నుంచే నాయకులు
తండాలో ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చి ప్రభుత్వ కార్యాలయాలకు పోవాలంటే ఎవరో ఒక లీడర్ తోడుండాల్సిందే. ఆయన దారి ఖర్చులన్నీ చూసుకోవాల్సిందే. ఇప్పుడు తండాల్లో పరిస్థితులు మారాయి. యువకులే నాయకులవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా గెలిచి తండా ప్రజల ప్రతినిధులుగా అధికారులకు పరిచయం చేసుకుంటున్నారు. ‘నాయకులు మా ఓట్ల కోసం చాలా మాటలు చెప్పినరు సార్.. కానీ ఏదైనా పని కోసం వెళ్తే గంటలు గంటలు పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ గోస తప్పింది. సర్కార్ ఆఫీసులకు వెళ్లే ధైర్యం వొచ్చింది.
పెద్ద సార్లతోటి డైరెక్టుగా మాట్లాడుతున్నాం’ అంటూ గర్వంగా చెబుతున్నాడు శంకర్ నాయక్. తండాకు ఎన్నటికీ రాదనుకున్న కరెంట్ ఇప్పుడు ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నది. నడ్డివిరిచే వడ్డీ వ్యాపారాల తలనొప్పే లేదు. ఇంటి ముందు గుడ్డిదీపంలా కూర్చున్న ముసలమ్మ మొఖంలో దిగులు మాయమైంది. ఎటూ సరిపోని రూ.200 ఫించన్.. నెలంతా ఆసరా అయ్యేలా రూ.2000కు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. కొడుకు, కోడలు యాల్లకు బుక్కెడు పెడుతరో లేదో అన్న ఎదురుచూపులు ఇప్పుడు లేవు.
మారిన బతుకు చిత్రం
‘నెలకు రెండు వేలు ఫించిని ఇస్తున్నడు. మందుల ఖర్చులకు, మనవలు, మనవరాండ్లకు చాక్లెట్, బిస్కెట్ కొనియ్యనీకె అక్కరకొస్తున్నయ్. నా కొడుకు, కోడలు కూడా మంచిగ సూస్కుంటున్నరు’ అని మురిసిపోతున్నది పోల్యానాయక్ తండాకు చెందిన జగిని. ఆమె భర్త చనిపోయాడు. తండాలో భూమి ఉన్నా.. సాగు చేసే శక్తి లేదు. మొక్కవోని ధైర్యంతో ఉన్న ఒక్క కొడుకును చంకనెత్తుకొని హైదరాబాద్ వలసొచ్చింది. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడింది. దినమొక గండంలా గడుస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. మారుమూల పల్లెల్లోనూ వసతులు పెరిగాయి. బతుకులు బాగు చేసే పథకాలు అందరికీ అందుతున్నాయి.
ఇదంతా కండ్లారా చూస్తున్న జగినికి మళ్లీ తండాకు వెళ్లాలని.. పడావ్ పడ్డ భూమిని సాగు చేయాలని అనిపించింది. చేతికొచ్చిన కొడుకును తీసుకొని తండాబాట పట్టింది. పంటపంటకు ఏ ఆఫీసుకూ తిరగకుండానే రైతుబంధు పైసలు అకౌంట్లో పడుతున్నాయి. అడగకముందే ఆసరా పించను అందుతున్నది. గ్రామ పంచాయతీలుగా అవతరించిన తర్వాత తండాల రూపురేఖలే మారి పోయాయి. ‘ఇప్పుడు పట్నం పోవాలన్న ఆలోచన లేదు. తండాకు అన్నీ వచ్చినయి. మా బతుకులు మారినయి సార్’ అంటున్నది జగిని. ఇవన్నీ.. జగిని, కమ్లీ, శ్రీను నాయక్, నీల, పిక్లూ నాయక్ చెప్పిన మాటలు మాత్రమే కాదు. గిరిజన తండాలన్నీ ఒక్క గొంతులో ఎలుగెత్తుతున్నాయి.. జై కేసీఆర్ అంటూ!
మాకు కేశ్యానాయక్ ఉన్నడు
‘నాకు తొంభై ఏండ్లు ఉండాయి బిడ్డా.. సాగర్ కాల్వ కట్టినప్పుడు నెవ్రూ వొస్తుండంటే.. ఎడ్లబండిల పోయి సూశినం. ఆయన బిడ్డ ఇంద్రాగాంధీ పరిపాలన సుత చూశిన. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్ ఇట్ల శానమందిని సూశిన. ఆళ్లతోని కాని శాన పనులు మా కేశ్యానాయక్ (కేసీఆర్) చేస్తున్నడు బిడ్డా. రైతులను సూస్కుంటున్నడు. ఆడపిల్లలను సూస్కుంటున్నడు. ముసలోళ్లను సూస్కుంటున్నడు’ అని ధర్మతండకు చెందిన 90 ఏండ్ల నీల ఈ మాటలు చెప్తున్నప్పుడు సొంత కొడుకు ఏదైనా సాధిస్తే తల్లి కండ్లల్లో ఎంత సంబురం కనిపిస్తదో.. అంత ఆనందం కనిపించింది. పాలకులు నిర్ణయం తీసుకోవాలంటే క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలిసి ఉండాలి. అందుకు సీఎం కేసీఆర్ తిరుగులేని ఉదాహరణ.
రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ సమస్తాన్నీ పాదయాత్రల ద్వారా ఆయన కండ్లారా చూశారు. నిర్వీర్యంగా ఉన్న వ్యవస్థను.. ప్రజల అవస్థను అర్థం చేసుకున్నారు. ఆ అనుభవంతో తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు అభివృద్ధి ఫలాలై చేతికందుతున్నాయి. పేదింటి ఆడబిడ్డ పెండ్లి తల్లిదండ్రులకు గుండెల మీద భారంలా ఉండేది. కానీ.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడబిడ్డ అడ్డం కాదు.. ఆమె పెండ్లి భారం కాదు అని నిరూపించాయి. ‘నా బిడ్డ పెండ్లికి ఎనిమిది తులాల బంగారం పెట్టిన. పది మేకలు కోశిన. కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకంల లక్ష రూపాయలు వచ్చినయ్. పెండ్లి ఖర్చులకు చాలా ఆసరా అయింది’ అంటూ మర్రిచెట్టు తండా శాంతి చెప్పింది.
పిల్లల అమ్మకం బంద్
తెలంగాణ రాకముందు పిల్లలను సాదనీకె కూడా సౌలత్ లేకుండె. పుట్టిన పిల్లలను అమ్ముకునే పరిస్థితి ఉండె. ఇప్పుడు తండాలు చాలా మారినయి. పసిపిల్లల అమ్మకం లేదు. పిల్లలను హాస్టళ్ల వేసి సదివిస్తున్నం.
– చీన్యా నాయక్ దుబ్బతండా
అన్నీ వచ్చినయి
మాకు ఏడెకరాలు ఉంది. బోరుల నీళ్లున్నయి. రైతుబంధు పంట ఖర్చులకు సరిపోతున్నయి. పండించిన పంట దేవరకొండ తీస్కపోయి అమ్ముతున్నం. ఒకప్పుడు రోడ్డు గూడ లేకుండె. ఇప్పుడు అన్నీ వచ్చినయి. మాకు ఇదే సాలు.
-సువాలీ, ధర్మతండా
మాదే అధికారం
ఏ సౌకర్యం కావాలన్నా సర్పంచ్లను బతిమిలాడాల్సి వచ్చేది. ఊళ్లోని అన్ని వార్డులకు, వాడలకు అయిన తర్వాత.. అదీ నిధులు మిగిలితే తండాకు పనులు చేసేవాళ్లు. రిజర్వేషన్ లేకపోతే పోటీ చేసే అవకాశం ఉండేది కాదు. మా బాధలు నాయకులకు అర్థమయ్యేవి కావు. ఇప్పుడు మా తండాలో మాదే అధికారం.
– మహేశ్ నాయక్ ఉప సర్పంచ్, దుబ్బతండా
మా నిధులు మాకే
కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వకపోయేది. అర్ధరాత్రి చేనుకు నీళ్ల కోసం బోరు పెట్టనీకె పోయి కరంటు షాక్ కొట్టి మా తండాల ఎనిమిది మంది రైతులు చనిపోయిండ్రు. ఇప్పుడు త్రీ-ఫేజ్ కరెంట్ వస్తున్నది. ఆటోమెటిక్ స్టార్టర్లు పెట్టుకున్నరు. కరెంట్ షాక్ల బాధ తప్పింది. ఒకప్పుడు తండాకు ఏమైనా కావాలంటే గ్రామ పంచాయితీ దగ్గర గంటలు గంటలు నిలవడి సర్పంచ్లను బతిమిలాడేటోళ్లం. తండాలు పంచాయతీలు అయినంక.. అందరం కూసోని తండాకు ఏమేం కావాల్నో మేమే మాట్లాడుకుని.. మా నిధులు మాకే ఖర్చు చేస్కుంటున్నం. వీధివీధికి రోడ్లేసుకున్నం. ఇంటింటికీ నల్లా వచ్చింది. వైకుంఠధామం కట్టుకున్నం. తండాలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నం. మా తండా గ్రామ పంచాయతీ అయినంక ఇప్పటివరకు రూ.8 కోట్ల 36 లక్షల నిధులు వచ్చినయి. తండా రూపురేఖలే మారిపోయినయి.
-నేనావత్ శ్రీను నాయక్ ,జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత మర్రిచెట్టు తండా
బాధలు తీరినయి
ఒకప్పుడు మా తండా పేరు చెప్తే పిల్లను కూడా ఇచ్చేటోళ్లు కాదు. ‘మీ ఊరికి రోడ్డు లేదు.. నీళ్లు రావు, కరెంట్ ఉండదు.. మీ తండాకు మా బిడ్డనిస్తే.. అడివిల ఇడ్శిపెట్టినట్టే’ అనేటోళ్లు. ఇప్పుడు తండాకు డాంబర్ రోడ్డు ఉంది. వాడవాడకు సీసీ రోడ్లు ఏస్కున్నం. త్రీ ఫేజ్ కరెంట్ వొస్తున్నది. ఇంటింటికీ కేసీఆర్ నల్లాలు ఉండాయి. మా పొలంల మేమే పని చేస్కుంటున్నం. ఇప్పుడు చుట్టాలు అడుగుతున్నరు.. ‘బుజ్జికి లగ్గం జేద్దమనుకుంటున్నం.మీ తండల పిలగాడుంటే జాడ చెప్పరాదూ’ అని.
– కమ్లి, పొర్లగడ్డ తండా
…? సుంకరి ప్రవీణ్కుమార్
– నర్రె రాజేష్